– పేరు మార్చటానికి రైల్వే మంత్రిత్వ శాఖ యత్నం
– కేంద్ర మంత్రివర్గానికి ప్రతిపాదనలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రైల్వే మంత్రిత్వ శాఖ ‘ఇండియా’ పేరును తొలగించి ‘భారత్’ పేరుతో భర్తీ చేయాలని ప్రతిపాదించింది. పేరు మార్పునకు సంబంధించి కేంద్ర మంత్రి వర్గానికి తెలిపింది. భారత్ పేరు వినియోగానికి సంబంధించి ఇలాంటి ప్రతిపాదన కేంద్రమంత్రివర్గం ముందుకు రావడం ఇదే తొలిసారి. రానున్న రోజుల్లో మరిన్ని ప్రభుత్వ శాఖలు భారత్ అనే పేరును ఉపయోగిం చనున్నట్టు అధికారులు తెలిపారు. రాజ్యాంగంలో ఇండియా, భారత్ అనే పేర్లకు సమాన ప్రాధాన్యత ఉందని, అందువల్ల కేంద్రమంత్రివర్గం భారత్ అనే పేరును ఉపయోగించడంలో తప్పులేదని ప్రభుత్వం వాదిస్తోంది. జీ20 సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన విందుకు సిద్ధం చేసిన ఆహ్వానపత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాశారు. జి20 నేతల సదస్సులో ప్రధాని మోడీ టేబుల్ ముందు భారత్ అని రాశారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో కూడా ఇండియా పేరును తొలగించి, దానికి బదులు భారత్ను ఉపయోగించాలని ప్రతిపాదించారు.