– అశ్వారావుపేట సీపీఐ(ఎం) అభ్యర్థి అర్జున్రావు
పలు కార్మిక సంఘాలకు నేతృత్వం వహిస్తున్న నాయకుడిగా, సామాజిక అవగాహన, నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలపై పూర్తి అవగాహన ఉన్నదని అశ్వారావుపేట సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి పిట్టల అర్జున్ రావు తెలిపారు. నియోజకవర్గ సామగ్రాభివృద్ధే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో నిలిచానని, తనను గెలిపిస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అర్జున్ నవతెలంగాణకు తెలిపారు.
నియోజకవర్గంలో ఏఏ సమస్యలు గుర్తించారు..?
గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు పూర్తి స్థాయిలో నేటి వరకు అందలేదు. వ్యవసాయానికి సాగునీటి సమస్య, రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. పామాయిల్ సాగు విస్తారంగా చేపడుతున్న రైతులకు గిట్టుబాటు ధరలు అందడం లేదు. వసతి గృహాల్లో, ఆశ్రమ పాఠశాలల్లో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్కీం వర్కర్లు, సంఘటిత రంగ కార్మికులకు కష్టానికి తగిన వేతనాలు లేవు. పేద కుటుంబాలకు రేషన్ కార్డుల సమస్య ఉంది. యువతకు ఉద్యోగాల కల్పన లేదు.ఉపాధి హామీ చట్టం ద్వారా అర్హులైన వారికి తగిన పని దినాలు కల్పించడంలో, చేసిన పనికి కూలీ డబ్బులు సరైన సమయంలో చెల్లించడంలో వైఫల్యం ఉంది. కొలతల పద్ధతులు కాకుండా పనిచేస్తున్న కూలీలకు రోజు వారీ కూలి ఇవ్వాలి. ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేని పేదలు వందల మంది ఉన్నారు. వీరికి ఇంటి స్థలం కేటాయించి ఇల్లు నిర్మించడంలో ప్రభుత్వ వైఫల్యం ఉంది.
గతంలో మీరు నిర్వహించిన ఉద్యమాలు? సాధించిన విజయాలు?
గతంలో రైతులు, వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ, సంఘటిత, అసంఘటిత కార్మికులు, స్కీం వర్కర్స్, వృత్తిదారులు, మహిళల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించాం. గిరిజన, గిరిజనేతర పేదలకు పోడు భూములు కొట్టించి, అటవీ హక్కుల చట్ట ప్రకారం పార్టీ నిర్వహించిన ఆందోళన పోరాటాల్లో పాల్గొన్నాను. పోడు పట్టాల సమస్య కొంతవరకు పరిష్కారం అయింది. ఆశా, అంగన్వాడీ, ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కార్మికులు, నర్సరీ కార్మికులు, ఆయిల్ పామ్ గెలలు కోత లేక సేకరణ కార్మికుల సమస్యలపై నిరసన కార్యక్రమాలు, సమ్మెలు నిర్వహించి విజయం సాధించాం.