ఐదు ఇరాన్ చమురు ట్యాంకర్లపై అమెరికా దాడులు
ప్రతిగా జోర్డాన్లోని సైనిక స్థావరాల పైకి దూసుకొచ్చిన టెహ్రాన్ క్షిపణులు
భగ్గుమన్న ముడి చమురు ధరలు
(నవ తెలంగాణ – జనరల్ డెస్క్)
మధ్యప్రాచ్యంలో ‘జల’ యుద్ధం తీవ్ర మైంది. అమెరికా సైనిక దళాలు మంగళవారం ఐదు ఇరాన్ చమురు ట్యాంకర్లపై దాడి చేశాయి. వీటిలో ఒక దానిని నీటిలో ముంచేశాయి. దీనికి ప్రతీకారంగా అమెరికా నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అంతేకాక జోర్డాన్లోని అమెరికా సైనిక ఆస్తులను లక్ష్యంగా చేసుకొని వరుసగా బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇదిలావుండగా అమెరికా-ఇరాన్ ఘర్షణలు, సౌదీ అరేబియాలో హౌతీల దాడుల నేపథ్యంలో చమురు ధర బుధవారం బ్యారల్కు వంద డాలర్లు దాటింది. జూలై తర్వాత చమురు ధర ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి.
గల్ఫ్ ఆఫ్ ఒమన్లో నాలుగు ముడి చమురు రవాణా నౌకలపై, పర్షియన్ గల్ఫ్లో ఇరాన్ చమురు ఎగుమతులకు కేంద్రంగా ఉన్న ఖర్గ్ దీవి సమీపంలో ఓ నౌకపై దాడి చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) తెలిపింది. వీటిలో ఎం/టీ రెస్కో అనే నౌక మంటల్లో చిక్కుకొని గల్ఫ్ ఆఫ్ ఒమన్లో మునిగిపోయింది. తాను లక్ష్యంగా చేసుకున్న నౌకలపై దాడి చేయడానికి ముందు వాటిని వదిలేసి వెళ్లిపోవాలని సిబ్బందిని అమెరికా దళాలు ఆదేశించాయి. రెండు నౌకలలోని సిబ్బందిని లైఫ్బోట్లలో ఒడ్డుకు చేర్చారు. గత రెండు రోజులుగా తన నౌకలపై ఇరాన్ రెండుసార్లు దాడులకు ప్రయత్నించడంతో అమెరికా ప్రతిదాడులకు దిగింది. అమెరికా నౌక ఇరాన్ క్షిపణులను తప్పించుకొని ప్రాంతీయ జలాలలో గస్తీని కొనసాగిస్తోందని సెంట్కామ్ తెలియజేసింది. అమెరికా దాడులపై మండిపడిన ఇరాన్ సేనలు జోర్డాన్పై పెద్ద ఎత్తున క్షిపణు లను ప్రయోగించాయి. అమెరికా దళాలు ఉపయోగిస్తున్న మువఫ్ఫాక్ సాల్టీ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపాయి. ఇరాన్ వైపు నుంచి 20 బాలిస్టిక్ క్షిపణులు దూసుకొచ్చాయని, వాటిలో 18 క్షిపణులను తమ గగనతల రక్షణ వ్యవస్థలు విజయ వంతంగా ధ్వంసం చేశాయని, రెండు క్షిపణులు నిర్జన ప్రాంతాలలో పడ్డాయని జోర్డాన్ చెప్పింది. కాగా బహెరెన్, కువైట్ ఓడరేవుల సమీపంలో ఉన్న చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. నౌకలు లంగరు వేసి ఉన్నా లేదా ఓడరేవులలో నిలిచి ఉన్నా వెంటనే వదిలేయాలని ఐఆర్జీసీ సూచించింది. అయితే ఇరాన్ తమ నౌకలపై దాడి చేసిన ప్రతిసారీ తాము ప్రతీకార దాడులు జరుపుతామని కొలంబియా పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో హెచ్చరించారు.
ఎర్ర సముద్రంలో హౌతీల దాడులు
మరోవైపు సౌదీ అరేబియాలోని స్థావరాలపై హౌతీలు దాడులు కొనసాగిస్తున్నారు. ఎర్ర సముద్రంలో ప్రయాణి స్తున్న చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకొంటు న్నారు. సౌదీ విమానా శ్రయాలపై కూడా దాడులు జరుగుతున్నాయి. ఓడరేవులు, విమానాశ్రయాలను సౌదీ దిగ్బంధిస్తోందని, సనా విమానాశ్ర యంపై వైమానిక దాడి జరిపిందని, దీనికి ప్రతీకారంగానే తాము ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్లపై దాడులు చేస్తున్నామని హౌతీలు తెలియజేశారు.
తీవ్రమైన ‘జల’ యుద్ధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



