నవతెలంగాణ-హైదరాబాద్ : పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆయన కుమారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో ఏకాంత నిర్బంధంలో ఉన్న తమ తండ్రికి సరైన వైద్యం అందకపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదం జరగవచ్చని హెచ్చరించారు. మంగళవారం ఆన్లైన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇమ్రాన్ కుమారులు ఖాసిం, సులేమాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
“ఈ పరిస్థితుల్లో ఆయన జైలు నుంచి ప్రాణాలతో బయటపడటం కష్టంగానే కనిపిస్తోంది” అని ఖాసిం వ్యాఖ్యానించారు. ఇమ్రాన్ ఖాన్ అంతర్జాతీయ న్యాయవాది జేర్డ్ గెన్సర్ ఈ పరిస్థితిని “స్లో-మోషన్ హత్య”గా అభివర్ణించారు. గత మూడేళ్లుగా తన తండ్రి ఏకాంత నిర్బంధంలో ఉన్నారని, కిటికీలు లేని 6×8 అడుగుల గదిలో రోజుకు 23 గంటలకు పైగా బంధిస్తున్నారని కాసిం ఆరోపించారు. సరైన వైద్యం అందకపోవడం వల్లే ఆయన కుడి కంటి చూపును దాదాపుగా కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశించినా ఇమ్రాన్ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించకుండా, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ఫిట్గా ఉన్నారని ప్రకటించడాన్ని వారు తప్పుబట్టారు. గత ఆరు నెలలుగా తమ తండ్రితో ఒక్కసారి కూడా మాట్లాడలేదని, ఇది స్పష్టంగా మానవ హక్కుల ఉల్లంఘనేనని మరో కుమారుడు సులేమాన్ అన్నారు. తన తండ్రి నిర్బంధం, చిత్రహింసల వెనుక పాకిస్థాన్ సైనిక యంత్రాంగం హస్తం ఉందని ఆయన ఆరోపించారు.
ఇమ్రాన్కు వైద్యం అందించాలని కోరుతూ 21 మంది మాజీ అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్లు పాక్ ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని సులేమాన్ గుర్తుచేశారు. మరోవైపు, ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై పాక్ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ధిక్కరణ పిటిషన్పై సెప్టెంబర్ 16న విచారణ జరగనుంది.



