టోక్యో: పాలక ఎల్డిపి కొన్ని సంస్థల నుంచి రహస్యంగా ముడుపులు స్వీకరించినందుకు జపాన్ ప్రధాని కిషిదా పార్లమెంటరీ ప్యానెల్ ఎదుట క్షమాపణలు చెప్పారు. రాజకీయ పార్టీలకు నిధులపై నియంత్రణకు సంబంధించిన చట్టాలను సంస్కరించేందుకు తాను కృషి చేస్తానని అన్నారు. గురువారం పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ ముందు కిషిదా హాజరయ్యారు. ముడుపుల కుంభకోణంపై ఎథిక్స్ కమిటీ ముందు ఒక ప్రధాని హాజరై ఇలా క్షమాపణ చెప్పడం జపాన్ పార్లమెంటరీ చరిత్రలో ఇదే మొదటి సారి. ఈముడుపుల భాగోతం తరువాత ఎల్డిపి ప్రతిష్ట మరింత దిగజారినట్లు తాజాగా నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ తెలియజేస్తున్నాయి.