జెఇఇ అడ్వాన్స్‌డ్ అడ్మిట్ కార్డులు విడుదల

నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటి)లలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల అయ్యాయి. జూన్ 4న రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించేందుకు ఐఐటి గుహవాటి ఏర్పాట్లు చేస్తోంది. జెఇఇ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఏప్రిల్ 30 నుంచి మే 7 వరకు జెఇఇ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న విషయం తెలిసిందే. జెఇఇ అడ్వాన్స్‌డ్‌లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ మూడు గంటల వ్యవధి ఉంటుంది. పేపర్ 1 ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనుంది. దేశ వ్యాప్తంగా 1.9 లక్షల మంది పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Spread the love