జీ హుజూర్‌

– ఇదీ మోడీ ఇంటర్వ్యూల తీరు
– అబద్ధం చెప్పినా ‘ఐతే ఓకే’
– అసత్యాలు, ప్రత్యారోపణలతో సరి
– ఎదురు దాడితో తప్పించుకునే ప్రయత్నం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 31 నుండి ఈ నెల 14వ తేదీ వరకూ వివిధ పత్రికలు, న్యూస్‌ ఛానల్స్‌కు 41 ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆయనకు ఎదురైన క్లిష్టతరమైన ప్రశ్నల సంఖ్య బాగా తక్కువే. ఉదాహరణకు న్యూస్‌ 18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మొట్టమొదటిసారిగా ఆయనకు ఓ క్లిష్టమైన ప్రశ్న ఎదురైంది. రాజస్థాన్‌లోని బన్‌స్వారాలో జరిగిన ర్యాలీలో ముస్లింలకు వ్యతిరేకంగా మెడీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ప్రశ్న అది.
‘అధిక సంతానం’ అనే మాట తాను కేవలం ముస్లింలను ఉద్దేశించి మాత్రమే చెప్పలేదని ప్రధాని బదులిచ్చారు. ‘అన్ని పేద కుటుంబాలలోనూ సంతానం ఎక్కువగానే ఉంటుంది. వారు తమ పిల్లలను విద్యావంతులను చేయలేరు. పేదరికం ఎక్కడ ఉంటుందో అధిక సంతానం అక్కడ కన్పిస్తుంది’ అని వివరణ ఇచ్చారు. తాను హిందువులు లేక ముస్లింలు అని చెప్పలేదని తెలిపారు. చొరబాటుదారులంటే ఎవరని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అడగనూ లేదు. మోడీ చెప్పనూ లేదు. అంతేకాదు…మోడీ వాదనలను పాత్రికేయులెవ్వరూ సవాలు చేసిన పాపాన పోలేదు. హామీల అమలులో ఎందుకు విఫలమయ్యారని కూడా జర్నలిస్టులు నిలదీయలేదు.
ఈ అంశాలపై ప్రశ్నలేవి?
పాత్రికేయులతో ముచ్చటించేటప్పుడు మోడీ ఎక్కువగా తన ‘మూడో పదవీకాలం’ గురించే కాకుండా 2047 నాటికి భారత్‌ విజన్‌పై కూడా మాట్లాడారు. పది సంవత్సరాల పాలనలో మీ ట్రాక్‌ రికార్డు ఏమిటని ఒక్క పాత్రికేయుడు కూడా ప్రశ్నించలేదు. ప్రధాని 41 ఇంటర్వ్యూలు ఇచ్చినప్పటికీ కోవిడ్‌ను ప్రభుత్వం ఎలా ఎదుర్కొన్నదంటూ ఒక్క ప్రశ్న అడిగిన వారు లేరు. దేశంలో ముస్లింలపై జరుగుతున్న హింసను కూడా ఎవరూ ప్రస్తావించలేదు. ‘అస్సాం ట్రిబ్యూన్‌’ పత్రిక ఇంటర్వ్యూలో మాత్రం మణిపూర్‌ హింసపై ప్రశ్నించారు. ‘న్యూస్‌వీక్‌’ పాత్రికేయుడు చైనాతో సరిహద్దు ఉద్రిక్తత గురించి ప్రశ్న వేశారు.
స్థానిక సమస్యల పైనా అంతే
తంతి టీవీ, ఎఎన్‌ఐ, రాజస్థాన్‌ పత్రిక, దివ్య భాస్కర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నికల బాండ్ల వివాదంపై మోడీని ప్రశ్నించారు. ఇక జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ రాసలీలల వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత మోడీ 29 ఇంటర్వ్యూలు ఇచ్చారు. ప్రజ్వల్‌ వ్యవహారంపై కేవలం మూడు ఇంటర్వ్యూల్లో మాత్రమే (టైమ్స్‌ నౌ ఛానల్‌, హిందీ పత్రిక హిందుస్థాన్‌, ఆంగ్ల పత్రిక హిందుస్థాన్‌ టైమ్స్‌) మోడీని ప్రశ్నించారు. ప్రాంతీయ మీడియా సంస్థలు తమ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను లేవనెత్తడంలో విఫలమయ్యాయి. ఉత్తరాఖండ్‌కు చెందిన స్థానిక హిందీ పత్రికలు అమర్‌ ఉజాలా, హిందుస్థాన్‌ వివాదాస్పద అగ్నిపథ్‌పై ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. ఈ రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున యువత సైనిక దళాల్లో చేరుతుంటుంది. అస్సాం ట్రిబ్యునల్‌, బెంగాల్‌ దినపత్రిక ఆనంద్‌బజార్‌ జర్నలిస్టులు మోడీని పౌరసత్వ సవరణ చట్టంపై ప్రశ్నించలేదు. అసోం, బెంగాల్‌ రాష్ట్రాల్లో ఈ చట్టం కీలకమైన ఎన్నికల అంశంగా మారింది. గుజరాత్‌కు చెందిన ఆరు వార్తా సంస్థలు మోడీని ఇంటర్వ్యూ చేశాయి. రాష్ట్ర బీజేపీలో నెలకొన్న విభేదాలపై ఒక్కరు కూడా ఆయన్ని ప్రశ్నలు అడగలేదు.
అబద్ధాలు…అభాండాలు
మత ప్రాతిపదికన విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం ప్రమాదకరం కాదా అని ఓ పాత్రికేయుడు ప్రశ్నిస్తే ఈ అంశం కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ఉన్నదని అబద్ధం చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ 400కు పైగా స్థానాలు కోరుకుంటోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణను టీవీ9 నెట్‌వర్క్‌ పాత్రికేయులు ప్రస్తావించినప్పుడు మోడీ సుదీర్ఘమైన సమాధానం ఇస్తూ రాజ్యాంగాన్ని కాంగ్రెస్‌ పార్టీ అనేక సందర్భాల్లో నీరుకార్చిందని ఆరోపించారు.
అత్యధిక మెజారిటీ ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని నలుగురు బీజేపీ నాయకులు బాహాటంగా చెప్పడాన్ని ఎవరూ గుర్తు చేయలేదు. ఎన్నికల బాండ్లపై కేవలం నాలుగు ఇంటర్వ్యూల్లో మాత్రమే మోడీని ప్రశ్నించగా ఆయన ఆ పథకాన్ని సమర్ధించారు. ఎన్నికల బాండ్ల పథకం ద్వారా కార్పొరేట్‌ సంస్థలు, బీజేపీ మధ్య చోటుచేసుకున్న క్విడ్‌ప్రోకో సంబంధాలపై మోడీని ఎవరూ ఏమీ అడగలేదు.
గత మూడు వారాల్లో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మోడీ పలు సందర్భాల్లో తప్పుడు వాదనలు విన్పించారు. సంపద పున:పంపిణీ, రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్‌పై అభాండాలు వేశారు. ఏప్రిల్‌ 5న కాంగ్రెస్‌ తన ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించింది. దానిపై పక్షం రోజుల పాటు పెదవి విప్పని మోడీ, బన్‌స్వారాలో తాను చేసిన ప్రసంగం వివాదాస్పదం కావడంతో దాని నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి తప్పుడు వాదనలు విన్పించడం మొదలు పెట్టారు. ఉదాహరణకు ఏప్రిల్‌ 15న ఎఎన్‌ఐ వార్తాసంస్థకు 77 నిమిషాల పాటు సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ఆ ప్రస్తావనే తేలేదు. ఏప్రిల్‌ 20న కన్నడ ఛానల్‌ ఆసియానెట్‌ సువర్ణకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ దాని గురించి ఊసే లేదు. బన్‌స్వారా ర్యాలీ తర్వాత ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూలోనూ కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను ప్రస్తావించి విమర్శలు గుప్పించారు.
తప్పని చెబితే ఎదురు దాడే
ఇంటర్వ్యూల్లో మోడీ తప్పుడు వాదనలు విని పించినా, తప్పుడు సమాచారం ఇచ్చినా పాత్రికేయులు ఆయనకు అది తప్పని చెప్పలేదు. ఒకవేళ ఎవరైనా ఆ విషయాన్ని గుర్తు చేస్తే మోడీ ఎదురు దాడికి దిగేవారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన ‘ప్రమాదకరమైన ప్రకటనల’ను ఆయన ప్రస్తావించే వారు. ప్రజ్వల్‌ ఉదంతాన్ని ఎవరైనా ప్రస్తావిస్తే అలాంటి వాటిని తాను సహించబోనని చెబుతూనే కాంగ్రెస్‌ పార్టీ గతంలో ప్రజ్వల్‌ రేవణ్ణ పార్టీతో సంబంధాలు పెట్టుకున్నదని గుర్తు చేశారు. సంపద పంపిణీ ప్రస్తావన కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో లేదన్న విషయాన్ని, ప్రజ్వల్‌ విదేశాలకు పరారైన విషయాన్ని పాత్రికేయులెవరూ లేవనెత్తలేదు. జేడీఎస్‌తో పొత్తు విషయంలో బీజేపీ నేతలు చేస్తున్న హెచ్చరికలను కూడా ఎవరూ ప్రస్తావించలేదు.
దక్షిణాదిపై ఫోకస్‌
మోడీ తన ఇంటర్వ్యూల్లో దక్షిణాది మీడియా సంస్థలకు ప్రాధాన్యత ఇచ్చారు. దీనిని బట్టి ఆయన దక్షిణ భారతదేశంపై దృష్టి సారించారని అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఏడు సంస్థలకు ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు. గుజరాత్‌ తర్వాత ఆయన ఎక్కువగా దృష్టి సారించింది దక్షిణాది పైనే. గుజరాత్‌ సంస్థలకు ఆరు ఇంటర్వ్యూలు ఇచ్చారు.
అది ప్రజా నినాదమేనట
మోడీ ఇంటర్వ్యూల్లో తరచూ వినిపించిన మరో పదం ‘400 ప్లస్‌’. బీజేపీ కార్యకర్తలకు ఆత్మసంతృప్తి కలిగించేందుకే మోడీ ఈ నినాదాన్ని ఎత్తుకున్నారన్న విమర్శలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని ప్రధాని చెప్పుకొచ్చారు. బీజేపీకి 370 సీట్లు ఇస్తే ఆర్టికల్‌ 370ని రద్దు చేసిందని ప్రజలు అనుకున్నారని, అందుకే వారి నుండే ఆప్‌కీ బార్‌…400 పార్‌ అనే నినాదం వచ్చిందని తెలిపారు. పైగా ఎన్డీఏకు ఇప్పటికే 400కు పైగా స్థానాలు ఉన్నాయని అంటూ ‘2019లో ఎన్డీఏ సుమారు 359 స్థానాలు గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్‌, ఒడిషా రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు మా వైపే ఉన్నాయి. అంటే మరో 35 స్థానాలు కలిశాయి. ఈశాన్య ప్రాంతం ఎంపీలు కూడా మా పక్షానే ఉన్నారు’ అని వివరించారు.

Spread the love