అవకాశవాద పార్టీలను మట్టి కరిపించండి

నవతెలంగాణ- నకిరేకల్:  రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశవాద పార్టీలను మట్టి కరిపించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల, సీపీఐ(ఎం) నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ చిన్న వేంకులు కోరారు. సోమవారం మండలంలోని గొల్లగూడెంలో సీపీఐ(ఎం) అభ్యర్థి బొజ్జ చిన్న వెంకులు ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పులతో దివాలా తీసిందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని కేసీఆర్ ప్రగల్బాలు పలికిన ప్రస్తుతం ఆరు లక్షల కోట్లకు అప్పు చేరిందన్నారు. మరోసారి బీఆర్‌ఎస్‌ కు అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని తాకట్టు పెడతాడని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలలో అధికార, ప్రతిపక్ష పార్టీలు డబ్బు సంచులతో ఓట్లు కొనేందుకు వస్తున్నాయన్నారు. ప్రజలు మోసపోకుండా కమ్యూనిస్టులను ఆదరించి అసెంబ్లీకి పంపించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు రాచకొండ వెంకట్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు లకపాక రాజు, మండల కమిటీ సభ్యులు కొప్పుల అంజయ్య, పాలడుగు పరమేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love