అవినీతి భయం వల్ల కేటీఆర్,హరీష్ రావు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు

– జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి 
నవతెలంగాణ – కంటేశ్వర్
కేటీఆర్, హరీష్ రావు ల అవినీతి బయటపడుతుందని భయంతోనే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్ లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన పిసిసి ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హందాన్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంతిరెడ్డి రాజారెడ్డితో కలిసి పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి  ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని గత ప్రభుత్వ బి ఆర్ ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 50 రోజులుగా గత ప్రభుత్వం చేసిన అవకతవకలను, పాపాలను నిర్వీర్యం చేసిన వ్యవస్థలు అన్నింటిని ఒక దారిలో పెడుతుందని, కానీ కేటీఆర్ హరీష్ రావు ఎక్కడ వాళ్ళ డొల్లతనం అవినీతి బయటపడుతుందో అని భయపడి ఒకరు కరెంటు బిల్లు సోనియాగాంధీ కి పంపుతామని, ఒకరు 4000 పెన్షన్ ఏమైందని పిచ్చికూతలు కూస్తున్నారని ఆయన అన్నారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలుగా నిరుద్యోగ భృతి పేరుతో, పేపర్ లీకేజీలతో ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను నిర్లక్ష్యం చేసిందని, అదేవిధంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, వివిధ కార్పోరేషన్లలో తీసుకున్న అప్లికేషన్లను పరిశీలించకుండా ప్రజలను మోసం చేసిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీదని ఆయన అన్నారు. కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు సోనియా గాంధీ మల్లికార్జున్ కార్గే  ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా 100 రోజులలో పూర్తి చేస్తుందని, అందులో ఇప్పటికే రెండు హామీలను ప్రభుత్వం ఏర్పడిన మూడు రోజుల్లోనే అమలు చేయడం జరిగిందని, రైతుబంధు కూడా దాదాపు 50 శాతం వరకు పూర్తి కావడానికి సిద్ధంగా ఉందని మానవ మోహన్ రెడ్డి తెలిపారు. కానీ ఇవేవీ ఆలోచించని కేటీఆర్ హరీష్ రావు కేవలం కాలం గడపాలని కాంగ్రెస్ ప్రభుత్వం పై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఇది వారికి సరైన పద్ధతి కాదని మానాల మోహన్ రెడ్డి హితవు పలికారు.బిఆర్ఎస్ నాయకులు ఇదే విధంగా ప్రజలను మాయమాటలతో మోసం చేయాలని చూస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బిఆర్ఎస్ నాయకులు రోడ్లపై తరిమి కొడతారని మానాల మోహన్ రెడ్డి అన్నారు.ఈ సమావేశంలో కైసర్,సర్దార్ నరేంద్ర సింగ్ పాల్గొన్నారు.
Spread the love