అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో చిరుత పులి మృతి..

– దహనం చేసిన ఫారెస్ట్ అధికారులు 

నవతెలంగాణ – అచ్చంపేట 
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో చిరుత పులి మృతి చెందింది. ఫారెస్ట్ అధికారులు ఖననం చేశారు. దోమల పెంట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గురు ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం ఏడు గంటల సమయంలో ఒక చిరుత పులి రోడ్డుపైన చనిపోయినదని స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.  అటవీశాఖ అధికారులు శ్రీశైలం డ్యాం సమీపంలో ఉన్న రహదారి ప్రహరీ గోడ పక్కన చూడగా ఒక సుమారు 8 నెలల మగ చిరుత పులి చనిపోయి ఉన్నది. ఇట్టి చిరుత పులిని అటవీశాఖ అధికారులు ముందుగా ఏదైనా వాహనము ఢీకొన్నదని అనుమానించినారు. కానీ ఇట్టి చిరుతపులిని పూర్తిగా పరిశీలించి చిరుత పులి శరీరం పైన మెడ భాగం పైన గోళ్ళ యొక్క ఆనవాళ్లు గమనించినారు. ఇట్టి చిరుత పులి వేరే ఇతర అడవి జంతువుతో పోరాడి చనిపోయినట్లు నిర్ధారించినారు, చిరుత పులి యొక్క గోర్లను, దంతాలను పరిశీలించగా ఏ విధమైన నష్టము జరగలేదు, తదుపరి వెటర్నరీ డాక్టర్ ను సంప్రదించి ఇట్టి చిరుత పులిని పోస్టుమార్టం జరిపించగా.. వెటర్నరీ డాక్టర్  పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం ఇట్టి చిరుత పులి ఇతర జంతువులతో పోరాడి చనిపోయినట్లు నిర్ధారించారు. అటవీశాఖ అధికారులు ఇట్టి చిరుతపులి యొక్క కళేబరాన్ని దహనం చేసినారు. ఇట్టి కార్యక్రమంలో సుశాంత్ IFS, గురు ప్రసాద్ ఎఫ్ ఆర్ వో దోమల పెంట, డాక్టర్ అనిల్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్,  దోమల పెంట రేంజ్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Spread the love