– మరోవైపు పోలీసుల తనిఖీలు
– భయం గుప్పిట్లో ఏజెన్సీ ప్రజలు
నవతెలంగాణ- తాడ్వాయి
దేశంలో పలు రాష్ట్రాల్లో వివిధ పేర్లతో సహా పోరాటం చేస్తున్న విప్లవ సంస్థలన్నీ ఒకే గొడుగు కిందికి వచ్చి మావోయిస్టు పార్టీగా అవతరించిన రోజునే సెప్టెంబర్ 21న ప్రతి ఏటా మావోయిస్టు పార్టీ వార్షికోత్సవాలు నిర్వహిస్తుంది. మావోయిస్టు పార్టీ ఆవిర్భవించి ఈ నెల సెప్టెంబర్ వరకు 19 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఘనంగా వారోత్సవాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. దీంతో ఏజెన్సీలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. పోలీసులు వ్యూహాత్మకంగా ముమ్మరంగా అడవుల్లో కూబింగ్ చేస్తున్నారు. ఈ వేడుకలను విజయవంతం చేయాలంటూ వాల్పోస్లర్లు, కరపత్రాలు, లేఖల ద్వారా మావోయిస్టు పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అయితే మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, ఓ ఎస్ డి అశోక్ కుమార్, డి ఎస్ పి రవీందర్ ల ఆదేశాల మేరకు పస్రా సి ఐ శంకర్ ఆధ్వర్యంలో తాడ్వాయి ఎస్సై ఓంకార్ యాదవ్ గత రెండురోజుల నుంచి మండలంలోని అన్ని గుత్తి కోయ గుంపుల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో ముమ్మరంగా వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం జలగలంచ, మొండాలతోగు, కొండపర్తి, కామారం గుత్తి కోయ గుడాలను ముమ్మరంగా తనిఖీ నిర్వహించారు. 163 జాతీయ రహదారిపై ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేశారు. అనుమానితులను పూర్తిగా పరిశీలించి వదిలేశారు. అనుమానితులు ఎవరైనా సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలియజేశారు. అంతేకాకుండా ప్రభావిత ప్రాంతాల పరిధిలోని పోలీస్ ఉన్నతాధికారులు సిబ్బందిని అప్రమత్తం చేశారు. సరిహద్దు అటవీ ప్రాంతాలకు భారీగా బలగాలను తరలిస్తున్నారు. వందల సంఖ్యలో దండకారణ్యానికి చేరుకుంటున్న సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ను ముమ్మరం చేశాయి. దీంతో సరిహద్దుల్లో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆదివాసీలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.