అత్యంత నాసిరకంగా మేడారం జాతర పనులు

– జాతర పనులు నాణ్యతగా సత్వరమే పూర్తి చేయాలి             
– మేడారం జాతరకు 150 కోట్లు కేటాయించాలి   

– భద్రాచలం మాజీ ఎంపీ, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మీడియం బాబురావు
నవతెలంగాణ -తాడ్వాయి
ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన జాతరైన మేడారం మహా జాతర పనులు అత్యంత నాసిరకంగా జరుగుతున్నాయని, నాణ్యతగా సకాలంలో వెంటనే పూర్తి చేయాలని భద్రాచలం మాజీ ఎంపీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఆదివాసి అధికార రాష్ట్రీయ మంచ్ (ఆర్మ్) జాతీయ అధ్యక్షులు మీడియం బాబురావు అన్నారు. బుధవారం మేడారం మహా జాతర పనులను తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో రైతు సంఘం నాయకులు, ఆదివాసి సంఘం నాయకులతో కలిసి మేడారంలో జరుగుతున్న ఆర్ అండ్ బి రోడ్డు పనులు, ఆర్డబ్ల్యూఎస్ పనులు, ఐబి శాఖ ఆధ్వర్యంలో జంపన్న వాగులో జరుగు ఇసుక చదును పనులు, పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలో జరుగు పనులు, కన్నెపెళ్లి, చిలకలగుట్ట, ఆర్టీసీ బస్టాండ్, జంపన్న వాగు, గద్దెల ప్రాంగణం, రెడ్డిగూడెం, కొంగలమడుగు, చింతల్ క్రాస్, నార్లాపూర్, ఊరట్టం జన సందోహం గా ఉండే ప్రదేశాలలో క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మీడియం బాబురావు మాట్లాడుతూ మేడారం మహా జాతర సమయం ఆసన్నమైందని ఇంకా సుమారు 40 రోజులు మాత్రమే సమయం ఆసన్నమైందని, భక్తుల రద్దీ అధికంగా ఉందని ఇంకా పనులు కొన్ని ప్రారంభం కాలేదని, కొన్ని పనులు నత్త నడకన నడుస్తున్నాయని, నాణ్యతగా లేవని నాసిరకంగా జరుగుతున్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వం గత జాతరకు 75 కోట్లే మంజూరు చేశారని, ఆ నిధులు సరిపోవని కొత్త ప్రభుత్వం 150 కోట్లు నిధులు మంజూరు చేసి భక్తుల సౌకర్యార్థం శాశ్వత నిర్మాణ పనులు చేపట్టాలని అన్నారు. మేడారం జాతర పనులు ప్రతి రెండేళ్లకు ఓసారి అవే అవే రిపీట్ జరుగుతున్నాయని దీన్నిబట్టి ఆ పనుల నాణ్యత ఎంత ఉందో గమనించాలన్నారు. మేడారం మహా జాతరకు కోటి మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న జాతరకు ఆ స్థాయిలో ఏర్పాట్లు పర్యవేక్షణ అవసరం కానీ లీడర్లు ఆఫీసర్లు అవినీతి కారణంగా జాతర పనులు ప్రతిసారి నాసిరకంగా జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ప్రతి జాతరకు కోట్ల నిధులు గంగలో పోసినట్టే అవుతుందని ఎద్దేవా చేశారు. భక్తుల రద్దీ ఉన్నందున జంపన్న వాగు వద్ద బ్యాటరీ టాప్స్ మహిళలు బట్టలు మార్చుకునే గదులు అతి తొందరగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మేడారంలో ఎండోమెంట్ శాఖ నిద్రావస్థలో ఉందని మేడారంలో ఎండోమెంట్ ఆఫీస్ స్థానికంగా ఏర్పాటు చేసి అధికారులను నియమించాలని తెలిపారు. గత తుఫాను వరదలకు కళ్యాణ కట్టలు, రోడ్లు ధ్వంసం అయ్యాయని వాటిని వెంటనే మరమ్మతు చేయాలన్నారు. అంతే కాకుండా జాతరకు ఎక్కడి నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం అధికారులు ఆలోచిస్తున్నారు గాని, స్థానికంగా ఉండే రైతులు ఆదివాసి గిరిజనుల బతుకుల గురించి ఆలోచించడం లేదని, స్థానిక గ్రామాల రైతులకు ప్రభుత్వం పంట నష్టపరిహారం అందించాలన్నారు. జంపన్న వాగు  పొడుగునా చిలకల గుట్ట వరకు ఇరువైపులా కరకట్ట నిర్మించి రైతుల భూములు కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు గొంది రాజేష్, రాష్ట్ర కమిటీ సభ్యుడు దుగ్గి చిరంజీవి, జిల్లా ఉపాధ్యక్షులు కోటే కృష్ణారావు, జిల్లా సహాయ కార్యదర్శి వంక రాములు, మండల కార్యదర్శి జెజ్జరి దామోదర్, మండల అధ్యక్షులు అల్లెం అశోక్, జిల్లా కమిటీ సభ్యులు ఊకే ప్రభాకర్, ఇర్ప శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Spread the love