నవతెలంగాణ-హైదరాబాద్ : కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘చెన్నై లవ్స్టోరీ’ ఈ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్బంగా మెగస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ చిత్రం ప్రీ రీలిజ్ వేడుక బుధవారం రాత్రి హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో శ్రీగౌరీ ప్రియ కథానాయిక. రవి నంబూరి దర్శకుడు. సాయిరాజేశ్, ఎస్.కె.ఎన్ కలిసి నిర్మించారు.
ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ నా అభిమానుల్ని ఇష్టపడతాను. వాళ్లు ఎదిగితే ప్రాణప్రదంగా చూసుకుంటాను. నన్ను స్ఫూర్తిగా తీసుకుని అందరూ గర్వించేలా ఎదిగారంటే అదే వాళ్లు నాపై చూపించే నిజమైన ప్రేమ అని భావిస్తా. అలాంటి అభిమానుల్ని ఈ వేదికపై చూడటం ఆనందంగా ఉంది అన్నారు. ఈ సినిమా పేరు వినగానే చెన్నైతో ఉన్న నా అనుబంధం గుర్తొచ్చింది. ఈ పేరులోనే ఓ మ్యాజిక్ ఉంది. ఈ వేడుకకి రావడానికి ప్రధానమైన కారణం నా అభిమానులే. ఎస్.కె.ఎన్, సాయిరాజేశ్, రవి నంబూరి, కిరణ్ అబ్బవరం సోదరుడు నా అభిమానులు. కిరణ్.. పవన్కల్యాణ్ అభిమాని. జీవితంలో ఎదిగిన అభిమానుల్ని చూసి ముచ్చటపడిపోతుంటా. నా అభిమానిగా పరిశ్రమకు వచ్చిన ఎస్.కె.ఎన్ విజయవంతమైన నిర్మాతగా ఎదిగాడు. సాయిరాజేశ్ రెండు జాతీయ పురస్కారాలు పొంది నా అభిమానుల్లో తలమానికంగా మారాడు. రవి నంబూరి తొలి సినిమా ఇది. వీళ్లంతా సాదాసీదా కుటుంబం నుంచి వచ్చినవాళ్లే. కానీ వీరి కలలు అసాధారణంగా ఉంటాయి. అదే ఈ స్థాయికి తీసుకొచ్చింది.
ప్రతి ఒక్కరూ కలలు కనాలి, నమ్మకంతో ముందడుగు వేస్తే తప్పకుండా అనుకున్నది సాధిస్తారు. కిరణ్ అబ్బవరం మన పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు. అతడి లాంటి కొత్త రక్తం పరిశ్రమకి రావాలి. తను మరింత ఉన్నతస్థాయికి చేరాలని కోరుకుంటున్నా. శ్రీగౌరీ ప్రియ తెలుగింటి అమ్మాయి. ఇతర భాషల్లోనూ రాణిస్తోంది. తెలుగమ్మాయిలు శక్తి సామర్థ్యాలు చూపించి ఎదగాలని కోరుకుంటున్నా’’ అన్నారు.



