నల్లమలలో ప్రభుత్వ బడులపై ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ 

నవతెలంగాణ – అచ్చంపేట
నల్లమల్ల ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గంలో  ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పేద విద్యార్థులకు జ్ఞానాన్ని అందించే విధంగా అభివృద్ధి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు.బుధవారం పట్టణంలోని సాయిరాం కాలనీలోని జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్లో బడిబాట ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం బాలుర హైస్కూల్ కు 70 లక్షలతో మౌలిక వసతులు కల్పిస్తామని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల శాతం పెంపొందించాలనీ ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెంకటేష్ తన కుమారుడు ని ప్రభుత్వ హైస్కూల్లో ఆరవ తరగతిలో చేర్పించడం చాలా సంతోషం అన్నారు.  ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. పాఠశాల భవన పునర్నిర్మాణానికి 2 వేల కోట్ల కేటాయించడం హర్షించదగ్గ విషయం అన్నారు.ఒకే ఉపాధ్యాయులన్న బడులు మూసి వేయవద్దని ప్రభుత్వం నిర్ణయించిందనీ  అందుకు గాను11 వేల పోస్టులతో మెగా డీఎస్సీకి ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. సమస్యల పరిష్కారానికి త్వరలో విద్య కమిషన్, వ్యవసాయ కమిషన్  రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రామారావు, ప్రధానో పాధ్యాయులు, ఉపాధ్యాయులు,తదితరులు పాల్గొన్నారు.
Spread the love