ప్రిలిమినరీ పరీక్షకు అవసరమైన  ఏర్పాట్లు చేయాలి

– 47 పరీక్ష కేంద్రాలు 16899 మంది అభ్యర్థులు
– పరీక్ష కేంద్రాల పరిధిలో 144   సెక్షన్
– ఉదయం 10 గంటల లోపే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని
– జూన్ 1 నుండే అందుబాటులోకి హాల్ టికెట్లు 
– స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ఈనెల  9 న ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం  1 గంట వరకు నిర్వహించనున్న గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ టి.పూర్ణ చంద్ర ఆదేశించారు.గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణ విషయమై శనివారం  ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కో- ఆర్డినేషన్  కమిటీ సమావేశంలో మాట్లాడుతూ గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష జూన్ 9 వ  తేదీన ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందని, ఇందుకుగాను నల్గొండ జిల్లాలో మొత్తం 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లా నుండి 16899 మంది అభ్యర్థులు గ్రూప్-1  ప్రిలిమినరీ పరీక్షలను రాయనున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎలాంటి ఆసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. పరీక్ష కేంద్రాలలో  ఏర్పాట్ల విషయమై ఇదివరకే సంబంధిత అధికారులు  పరీక్ష కేంద్రాలను తనిఖీ  చేసి అవసరమైన అన్ని ఏర్పాట్లను నిర్ధారించుకున్నట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు గా సంబంధిత కళాశాలల, విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లను  నియమించామని, పరీక్ష నిర్వహించే అన్ని కేంద్రాలకు కలిపి తొమ్మిది రూట్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు.
రెవెన్యూ శాఖ ద్వారా పరీక్షలు నిర్వహించే రోజున అన్ని పరీక్ష కేంద్రాల పరిధిలో 144  వ సెక్షన్ విధించాలని, అభ్యర్థులు ఉదయం 10 గంటల లోపే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, 10 తర్వాత వస్తే పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం జరగదని స్పష్టం చేశారు.పరీక్ష కేంద్రంలో 3 కిలో మీటర్ల పరిధిలో జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని, ఆర్డీవో, తహసిల్దారులు పరీక్ష కేంద్రాలను తనిఖీచేయాలని, పోలీస్ ల  ద్వారా అవసరమైన గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని, 47 పరీక్ష కేంద్రాలలో బందోబస్తు తోపాటు, పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులు వెళ్లే ముందు  తనిఖీచేయడం, అలాగే తనిఖీకి మహిళా పోలీసులను సైతం నియమించాలని తెలిపారు. పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించబడవని, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్  కు మాత్రమే మొబైల్ ఫోన్ అనుమతి ఉంటుందని తెలిపారు. అనుమతించిన వారు తప్ప పరీక్ష కేంద్రాలలో ఇతరులు ఎవరు వెళ్లడానికి వీలులేదని, ప్రతిరూటుకి తప్పనిసరిగా భద్రత ఏర్పాటు చేయాలని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అన్ని కేంద్రాల వద్ద అత్యవసర వైద్య సేవలు అందించే విధంగా ఏర్పాటు చేయాలని, మున్సిపాలిటీ ద్వారా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆర్టీసీ అవసరమైనన్ని బస్సులను నడపాలని, అంతేకాక అభ్యర్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఫ్రీక్వెన్సీ పెంచాలని చెప్పారు. ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా ఆరోజు పరీక్ష కేంద్రాలలో విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ అధికారులను, గ్రూప్ వన్ పరీక్షల కోసం  కేటాయించిన సిబ్బంది అందరూ సకాలంలో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. అభ్యర్థులు హాల్ టికెట్లను జూన్ 1 మధ్యాహ్నం రెండు గంటల నుండి  www.tspsc.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులు క్యాలిక్యులేటర్లు పేజర్లు, సెల్ ఫోన్లు, టాబ్లెట్స్, పెన్ డ్రైవ్ లు, బ్లూటూత్ డివైస్లు, వాచ్ లు, మ్యాథమెటికల్ టేబుల్స్, లాక్ బుక్కులు, లాగ్ టేబుల్స్, వాలెట్లు, హ్యాండ్ బ్యాగ్ లు, ఫోచస్, రైటింగ్ ప్యాడ్, నోట్ చార్ట్స్, లూజ్ సీట్లు, అలాగే బంగారు ఆభరణాలు, ఇతర గాడ్జట్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, రికార్డింగ్ వస్తువులు అనుమతించడం జరిగిందని తెలిపారు.
బూట్ల వంటివి కాకుండా అభ్యర్థులు చెప్పులు మాత్రమే వేసుకోవాలని తెలిపారు. పరీక్ష పూర్తయ్యేంతవరకు అభ్యర్థులు పరీక్ష కేంద్రం వదిలి వెళ్ళకూడదని, పరీక్ష కేంద్రం వదిలి వెళ్ళే ముందు తప్పనిసరిగా ఓఎంఆర్ ఆన్సర్ సీట్లను అప్పగించి వెళ్ళాలని తెలిపారు. పరీక్ష కేంద్రంలో ఉదయం 9:30 గంటల నుండి అభ్యర్థుల బయోమెట్రిక్ ప్రారంభమవుతుందని, అందువల్ల తప్పనిసరిగా బయోమెట్రిక్ ఇవ్వాలని, అలాగే ఎగ్జామినేషన్ తర్వాత తిరిగి వెళ్లే ముందు కూడా తప్పనిసరిగా బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుందని అన్నారు. బయోమెట్రిక్ వేయని, ఓఎంఆర్ ఆన్సర్ సీటును అప్పగించిన అభ్యర్థుల ఓఎంఆర్ ల ఆన్సర్ మూల్యాంకనం చేయడం జరగదని అన్నారు. అలాగే పరీక్ష రాసే అభ్యర్థులు మెహేంది ధరించవద్దని ,అలాగే తాత్కాలిక టాటూస్, అభ్యంతరకరమైన మెటీరియల్ ను ధరించడం వంటివి చేయకూడదని అన్నారు. ప్రతి అర్ధగంటకు ఒకసారి అభ్యర్థుల సౌకర్యార్థం బెల్ ను మోగించడం జరుగుతుందని, అవసరమైతే  ఇన్విజిలేటర్ ద్వారా సైతం అభ్యర్థులు సమయాన్ని తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు ఒకరోజు ముందుగానే వారు పరీక్షరాసే కేంద్రాన్ని సందర్శించాలని, దానివల్ల వారికి సులభంగా ఉంటుందని తెలిపారు. హాల్ టికెట్లు పై సూచనలు అన్నిటిని ప్రతి అభ్యర్థి తప్పకుండా చదువుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్ పి రాములు నాయక్,ఆర్డిఓ రవి, డిఎస్పి శివ రామ్ రెడ్డి, డిఈఓ భిక్షపతి, ఇతర అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
Spread the love