నవతెలంగాణ-హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఈ నెల 3న నిర్వహించిన నీట్ (NEET) పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. రాజస్థాన్లో పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా తెలిపింది. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని NTA తెలిపింది. పేపర్ లీక్ కేసును దర్యాప్తు చేయడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి అప్పగించింది.
భారతదేశవ్యాప్తంగా MBBS, BDS, ఇతర అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సులలో ప్రవేశం కోసం నిర్వహించే ఏకైక ప్రవేశ పరీక్ష. మే 3న భారతదేశంలోని 551 నగరాల్లోని 5,400కు పైగా కేంద్రాలలో, విదేశాలలోని 14 నగరాలలో ‘పెన్-అండ్-పేపర్’ విధానంలో నిర్వహించారు. ఈ పరీక్షకు సుమారు 22.79 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.



