న్యూఢిల్లీ : విదేశీ క్రికెటర్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) కాంట్రాక్టు రద్దు చేసుకుని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో పీఎస్ఎల్ను వీడిన క్రికెటర్లపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిషేధం వేటు వేస్తోంది. జింబాబ్వే క్రికెటర్ బ్లెస్సింగ్ ముజరబాని కోల్కతా నైట్రైడర్స్ తరఫున ఆడుతుండగా.. అతడిపై పీసీబీ రెండేండ్ల పాటు వేటు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీలంక క్రికెటర్, ఆల్రౌండర్ దసున్ శనకపై సైతం పీసీబీ వేటు వేసింది. పాకిస్తాన్ సూపర్ లీగ్లో లాహోర్ క్వాలాండర్స్ తరఫున ఆడాల్సిన దసున్ శనక.. పీఎస్ఎల్ కాంట్రాక్టు వద్దనుకున్నాడు. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. సమగ్ర సమీక్ష, ప్లేయర్ రిజిస్ట్రేషన్ రూల్స్, కాంట్రాక్టు నిబంధనలను ఉల్లంఘించినందుకు శనకపై రెండేండ్ల పాటు నిషేధం విధించినట్టు పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో వచ్చే ఏడాది పీఎస్ఎల్కు శనక అనర్హుడు కానున్నాడు.


