(నిన్నటి సంచిక తరువాయి)
ఆర్ఎస్ఎస్ ఫాసిస్ట్ లక్షణాలు… ఒక పరిశీలన
బహుళత్వ సంస్కృతిని
తొక్కిపట్టి ఏకాత్మకంగా మార్చడం దాని లక్ష్యం. మన
సమాజంలో బహుళత్వంతో నిండిన భారత చరిత్రను తుడిచివేసి హిందూ మతోన్మాద, వర్ణశ్రమ ధర్మ చరిత్రనే భారత చరిత్రగా ప్రకటించడం దాని ముఖ్య ఉద్దేశం.
ఈ లక్ష్యాల కోసం ఎంతటి హింసకైనా, ఎంతటి చరిత్ర వక్రీకరణకైనా తెగించటం దాని కార్యక్రమం. ఇలాంటి భావజాలన్నీ ప్రతి ఘటించడం అత్యవసరం. కూలదోయటం అంతకన్నా అవసరం.
6.జాతీయ భద్రత: మన జాతి మీద ఇతర జాతులు యుద్ధం చేయబోతున్నాయి అనే ఒక బూచిగా చూపటం. వాళ్లు యుద్ధం చేయబో తున్నారు కాబట్టి మనం భద్రంగా ఉండాలి అని అంటే ముందు మన అంతర్గతంగా ఉన్న శత్రువులను ముఖ్యంగా ముస్లింలను, క్రిస్టియన్లను, దళితులను, కమ్యూనిస్టులను తుదముట్టించాలి. వీళ్లకు వ్యతిరేకంగా జాతిని ఐక్యం చేయాలి అనే భావనలను ప్రచారంలో, ఆచరణలోనూ పెట్టే ప్రయత్నం చేయటం. జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు లేకపోయినప్పటికీ ఏదో ప్రమాదం సంభవించబోతుందని ప్రజల్లో భయాందోళనలు కలిగించే ప్రచారాలు చేసి ఎన్నికలలో లబ్ది పొందటం. పుల్వామా దాడి ఘటన దీనికి రుజువు. పాకిస్థాన్ టెర్రరిస్ట్ చేతుల్లో 40మందికి పైగా మన జవాన్లు వీరమరణం పొందారు. వాళ్లు రోడ్డుమార్గం గుండా కాకుండా విమాన మార్గం ద్వారా వచ్చి ఉన్నట్లయితే వాళ్ల ప్రాణాలు పోయేవి కాదు. అలాంటిది అవసరమని విమానాలు పంపాలని, ఆనాటి కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రధానికి, హౌంమంత్రికి, రక్షణమంత్రికి, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కి చెప్పినప్పటికీ ఎలాంటి సౌకర్యం ఇవ్వకపోగా 40మంది జవాన్ల మరణాలలో జరిగిన ప్రభుత్వ తప్పిదాన్ని ఎవరి వద్ద చెప్పవద్దని సత్యపాల్ మాలిక్కు హుకుం జారీ చేసినట్లుగా ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ దాడి అనంతరం సర్జికల్ స్ట్రైక్. ఆ సర్జికల్ స్ట్రైక్ని అడ్డం పెట్టుకొని దేశంలో జరిగిన ఎన్నికల్లో లబ్ధి పొందారు. ఇలాంటివన్నీ ఫాసిస్టు లక్షణాలే, మనదేశంలో ఇదంతా గమనిస్తూనే ఉన్నాం.
7. మతం, రాజకీయాలు, పరిపాలన కలగలిసిపోవడం: మన దేశం ఒక సెక్యులర్ రాజ్యం. ఫెడరల్ వ్యవస్థ. అంటే సమాఖ్య దేశం. బహుళ సంస్కృతులు ఉన్న దేశం. సెక్యులర్ స్ట్రక్చర్. సెక్యులరిజం అంటే రాజ్యానికి మతం ఉండకూడదు. మత ప్రసక్తిలేని లౌకిక రాజ్యం. అంటే పరిపాలకులు మత ప్రచారాలలోనూ, మత క్రతువులలోనూ పాల్గొనరాదు. దేశంలోని ప్రజలు వారు ఏ మతాన్ని అయినా అవలంబించవచ్చు. ఏ మతంలోకి అయినా మారవచ్చు. అసలు మతమే అవసరం లేదు అనుకునే వారు మతరహితులుగా ఉండే అవకాశం కూడా రాజ్యాంగం కల్పించింది. అలాంటి గుండెకాయ లాంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మోడీ ప్రభుత్వం మత క్రతువులలో పాల్గొనటమే కాదు, మత ప్రచారాలను ప్రోత్సహించడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో కూడా ముందే ఉన్నది. మతం వ్యక్తిగతం. పరిపాలనలో మతాన్ని కలపకూడదు. కానీ కుంభమేళాలు, చండీ యాగాలు, సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్లో భూమి పూజలు లాంటి వాటిలో పాల్గొంటూ, సమాజంలో భక్తి పేరుతో, దేవుడి పేరుతో ప్రజల మధ్య విభజనను పెంచుతున్నది. మన మనదేశంలో స్వతహాగా ఉన్న రాజ్యాంగంలో పొందుపరిచిన సెక్యులరిజం పదాన్ని తీసివేయాల్సిందే అని ఆర్ఎస్ఎస్ బహిరంగంగానే ప్రకటిస్తున్నది. దాన్ని తొలగించటానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. సెక్యులరిజాన్ని తీసేసి ఈ దేశాన్ని ఒక మత రాజ్యాంగంగా మార్చాలని కుట్రలు పన్నుతున్నది ఆర్ఎస్ఎస్. ఇది ఫాసిస్టు లక్షణమే.
8. కార్పొరేట్ అధిపత్యాన్ని సమర్థించడం: కార్పొరేట్ శక్తులు బలపడేలా చూడటం. ఈ శక్తులే ప్రభుత్వం మీద పెత్తనం చెలాయించడం. వాళ్ల చెప్పు చేతల్లోనూ, వాళ్ల కనుసన్నల్లోనే ప్రభుత్వాన్ని నడపటం. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని పెంచి పోషించటం. ప్రపంచంలో 603వ స్థానంలో ఉన్న ఆదాని, మోడీ అధికారంలోకి వచ్చిన 2014 తర్వాత నుండి మొన్న మొన్నటి వరకు ప్రపంచంలో మూడో స్థానానికి ఎలా ఎదిగాడు? మోడీ, మోడీ ప్రభుత్వం అదాని లాంటి కార్పొరేట్ శక్తుల ఎదుగుదలకు నియమ నిబంధనలను కూడా ఉల్లంఘించి ఆదానికి సాయపడటం వలనే అది సాధ్యమైంది. అదాని మోడీ మైత్రి గురించి పార్లమెంట్లో ప్రస్తావిస్తే ప్రభుత్వం మౌనమే సమాధానం. అంతేకాదు వేరే కుంటి సాకులు చూపుతూ ఎదురు దాడి చేస్తూ, ప్రభుత్వమే పార్లమెంటు జరగకుండా స్తంభింప జేయటం మనం చూశాం. పార్లమెంటు సభ్యులు ఆ విషయాన్ని ప్రస్తావిస్తే, వారు ప్రస్తావించిన విషయాలను రికార్డుల నుంచి తొలగించడం, మైకులను కట్ చేయడం మోడీ ప్రభుత్వ దమననీతికి, ప్రజాస్వామ్యం మీద కనీస గౌరవం లేకపోవటానికి నిదర్శనం. కార్పొరేట్లకు కొమ్ము కాయటమంటే దేశంలోని కార్మిక, కర్షక సమస్త శ్రామిక వర్గాన్ని అణిచి ఉంచటం.
9.అవినీతి: మనదేశంలో మధ్యప్రదేశ్లోని వ్యాపం కుంభకోణం కానీ, కర్నాటకలోని అయితే ఇటీవల ఓడిన బీజేపీ ప్రభుత్వం నలభై శాతం కమిషన్ సర్కార్గా ముద్రపడింది. కమిషన్ లేకుండా ఏ పనికి క్లియరెన్స్ ఉండదు. వారి అనుకూల కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ సైతం 40శాతం కమిషన్కి బలయ్యాడు. నేను అలా ఇవ్వలేనని అలా ఇస్తే గిట్టుబాటు కాదని నన్ను అలా మానసికంగా హింస పెట్టవద్దని చెబుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నాటక కాంట్రాక్టర్ల సంఘం ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి ఈ ఘటనను గురించి అది నిజమేనని ధృవపరుస్తూ న్యాయం చేయమని ఉత్తరాలు కూడా రాసుకున్నారు. రాఫెల్ కుంభకోణం, ప్రభుత్వ సంస్థలను ప్రయివేటు వారికి కారు చౌకకు అమ్మటం, ప్రయివేటు పెట్టుబడిదారుల బకాయిలను వన్ టైం సెటిల్మెంట్ పేరుతో వారికి లబ్ది చేకూర్చటం, గత ఎనిమిది సంవత్సరాలలో పెట్టుబడిదారుల రుణాలు రూ.12.50 లక్షల కోట్లు మాఫీ చేయడం, అసెట్ మానిటైజేషన్ పేరుతో ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కారు చౌకకు పెట్టుబడిదారులకు అద్దెకివ్వటం ఇవన్నీ ఫాసిస్ట్ లక్షణాల నుంచి పుట్టినవే.
అందువల్ల ఈ రోజున భారత సమాజం ఎదుర్కొంటున్న ఫాసిజం మరింత లోతైనది. మరింత ప్రమాద భరితమైనది. భారతదేశంలో ఉన్న ఆధిపత్య మతం, పెత్తందారి కులాలు, నిచ్చెన మెట్ల కులవ్యవస్థ, ఆ కుల అసమానతల సమర్థన, బ్రాహ్మణీయ భావజాల అధిపత్యం, జాతుల అణిచివేత, భాషాధిపత్యం లాంటి పరిస్థితులు యూరప్లో ఒకనాడు ఉద్భవించిన అంతర్జాతీయ ఫాసిజానికి, ఇవి జాతీయంగా ఉన్న అదనపు లక్షణాలు తోడ్పడ్డాయి. ఈ లక్షణాలు భారతదేశంలో ఫాసిజం పెరగటానికి అనువైన భూమికను ఏర్పాటు చేశాయి. గత తొమ్మిది సంవత్సరాలుగా మనదేశంలో ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో ఈ ఫాసిజం విలయతాండవం చేస్తున్నది. ఫాసిజం భారతదేశంలో పొందిన నిర్దిష్ట రూపం హిందూ బ్రాహ్మణీయ ఫాసిజం. అది బహుళత్వ సంస్కృతిని తొక్కిపట్టి ఏకాత్మకంగా మార్చడం దాని లక్ష్యం. మన సమాజంలో బహుళత్వంతో నిండిన భారత చరిత్రను తుడిచివేసి హిందూ మతోన్మాద, వర్ణశ్రమ ధర్మ చరిత్రనే భారత చరిత్రగా ప్రకటించడం దాని ముఖ్య ఉద్దేశం. ఈ లక్ష్యాల కోసం ఎంతటి హింసకైనా, ఎంతటి చరిత్ర వక్రీకరణకైనా తెగించటం దాని కార్యక్రమం. ఇలాంటి భావజాలన్నీ ప్రతి ఘటించడం అత్యవసరం. కూలదోయటం అంతకన్నా అవసరం.
– పి.బి.చారి, సెల్:9704934614