నవతెలంగాణ-ఆలేరు టౌన్
శ్రావణ మాస బోనాలు పురస్కరించుకొని, ఆలేరు పట్టణంలో ఆదివారం అంగరంగ వైభవంగా మహిళలు సామూహికంగా భక్తిశ్రద్ధలతో బోనాలు గ్రామదేవతలకు సమర్పించారు. ఈ మేరకు పోచమ్మ దేవాలయం, గడి మైసమ్మ, బొడ్రాయి, కొలను పాక రోడ్డు, పోచమ్మ, దుర్గమ్మ, మైసమ్మ, ఉప్పలమ్మ దేవాలయాలకు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాల చుట్టూ ప్రదక్షణలు చేశారు. అనంతరం అమ్మవారికి కుమ్మరి పూజారుల సమక్షంలో మొక్కులు చెల్లించి, నూతన వస్త్రాలు, నైవేద్యం సమర్పించారు.
పట్టణం, గ్రామాలు ప్రజలు సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో జీవించాలని, కరువు కాటకాలు పారద్రోలాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని మొక్కుకున్నారు. ఆలయాల వద్ద మేకలు, గొర్రెపోతులు, కోళ్లు భక్తులు బలి ఇచ్చారు. దేవాలయాలు కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులతో కిటకిటలాడాయి. రాఖీ పౌర్ణమి మరుసటి రోజు ఆదివారం రావడంతో వచ్చిన బంధుమిత్రులతో కలిసి పట్టణమంతా సందడి సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో కుమ్మరి పూజారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



