నవతెలంగాణ – న్యూఢిల్లీ : అయోధ్యలోని రామ మందిర విరాళాల కుంభకోణం, విద్యార్థి నిరసనకారులపై పోలీసుల దురాగతాలకు నిరసనగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో సహా ప్రతిపక్ష ఎంపీలు మంగళవారం పార్లమెంట్ మకర ద్వారం ముందు నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ‘ఛందా చోర్, గడ్డి చోర్’, ‘అమిత్ షా జవాబ్ దో’ వంటి నినాదాలు చేశారు. రామ మందిరంలో విరాళాల దొంగతనం జరిగిందన్న ఆరోపణలకు ప్రతీకగా ఎంపీలు ఆ ప్రదేశంలో విరాళాల పెట్టెలను ఉంచి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాటి చుట్టూ బారులు తీరారు.
అందిన విరాళాలకు, ఆ తర్వాత జరిగిన ‘దొంగతనానికి’ ప్రతీకగా కొందరు ఎంపీలు ఆ పెట్టెలో నగదు కూడా వేశారు. ప్రియాంక గాంధీతో పాటు, ఎస్పీకి చెందిన డింపుల్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్, టీఎంసీకి చెందిన సాగరిక ఘోష్, ఆర్జేడీకి చెందిన సంజయ్ యాదవ్, మనోజ్ ఝా, ఆర్ఎస్పీకి చెందిన ఎన్కే ప్రేమ్చంద్రన్ తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ‘అమిత్ షా పార్లమెంటుకు ఎందుకు రాలేదు?’ అని రాసి ఉన్న బ్యానర్తో ఎంపిలు నిరసన తెలిపారు. హోం మంత్రి అమిత్షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రామమందిర విరాళాల సేకరణలో చోటుచేసుకున్నట్లు ఆరోపించబడుతున్న అక్రమాలు మరియు గత వారం విద్యార్థుల నిరసనలపై పోలీసులు దౌర్జన్యం పై ప్రభుత్వం సమాధానమివ్వాలని ఇండియా బ్లాక్ డిమాండ్ చేస్తోంది.



