ప్రజలు మార్పు కోరుకున్నారు .. మార్పు తెచ్చి చూపిస్తాం

– పరిశ్రమల రంగంలోనూ మార్పులు వస్తాయి
– త్వరలో ఫ్రెండ్లీ ఇండస్ట్రీ పాలసీ తెస్తాం
– పరిశ్రమలకు మళ్లీ నూతనోత్తేజాన్ని తీసుకొస్తాం
– అందరి సలహాలు స్వీకరిస్తాము,ఎంఎస్ఎంఈలకు తోడ్పాటు అందిస్తాం
– గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది
– పారిశ్రామికవేత్తలతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖాముఖి, సమావేశం
నవ తెలంగాణ –  మల్హర్ రావు
 ప్రజలు మార్పు కోరుకున్నారని, ఆ మేరకు మార్పు తీసుకొచ్చి చూపిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. త్వరలో కొత్త పారిశ్రామిక పాలసీని తీసుకొస్తామని వెల్లడించారు. అందరి సలహాలు సూచనలు స్వీకరిస్తామని ప్రకటించారు. గురువారం ఇక్కడ ఎఫ్టీసీసీఐ, ఫిక్కి, సీఏఏ, ఎఫ్టీఎస్ఏసీ, డిక్కి సంస్థల ప్రతినిధులు, ఇతర ప్రముఖ వ్యక్తులతో శ్రీధర్ బాబు ముఖాముఖిగా మాట్లాడారు. ప్రజలు మార్పు కోరారని, మార్పు తీసుకొచ్చి చూపిస్తామని, పరిశ్రమ రంగంలోనూ మార్పు వస్తుందని తెలిపారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు అనేక విధానపరమైన మార్పులు తీసుకొచ్చాయని, కాంగ్రెస్ హయాంలో అనేక పరిశ్రమలు ఏర్పడడమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ఏర్పాటు చేసి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచిందని వివరించారు. బీహెచ్ఈఎల్, డీఆర్డీఎల్, డీఎల్ఆర్ఐ, మిథాని వంటి సంస్థలను స్థాపించి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించిందని పేర్కొన్నారు. తాము 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తామని ఎన్నికల మెనిఫెస్టో లో పేర్కొన్నామని, ఆ మేరకు హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. అయినప్పటికీ పారిశ్రమిక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తూ మరిన్ని లక్షల మందికి ఉద్యోగాలు లభించేలా కృషి చేస్తామని, అందుకు పారిశ్రామిక వర్గాలు చొరువ తీసుకోవాలని కోరారు. యువ పారిశ్రామికవేత్తలని తయారు చేసే దిశగా ముందుకెళ్తామని, ప్లాన్ 2050 గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రానికి, యువతకు మేలు చేయబోయే ప్రయత్నాలు అన్నీ చేస్తామని, మనసు ఉంటే మార్గం ఉంటుందని, 100 శాతం అన్ని అమలు చేసి చూపిస్తామన్నారు. ఆరు గ్యారంటీ లు సైతం అమలు చేసి చూపిస్తామని తేల్చిచెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా చేసిందని విమర్శించారు. తమకు రాజకీయం చేయడం అలవాటు లేదని,  రాష్ట్రాన్ని ఎలా బాగు చెయ్యాలన్న ఆలోచన, తపనతో ప్రతి క్షణం పని చేస్తున్నామని స్పష్టం చేశారు. 1991 లో ఈ దేశం అప్పటి ప్రధాని పీవీ నరసింహా రావు నేతృత్వంలో కీలక మలుపు తిరిగిందని, పీవీ ప్రధానిగా,  మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా విప్లవాత్మమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వాళ్లు దేశాన్ని ముందుకు తీసుకువచ్చారని కొనియాడారు. పారిశ్రామికంగా హైదరాబాద్ ఈ ప్రపంచానికి కోవిడ్ వాక్సిన్ ఇచ్చేలా అభివృద్ది చెందిందని, బయటి దేశాలు ముఖ్యంగా అభివృద్ది చెందిన దేశాలు సైతం హైదరాబాద్ ను ఫార్మా ఇండస్ట్రీ  హబ్ గా గుర్తిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ లో మిస్సైల్ తయారై, ఇజ్రాయిల్ కి ఎగుమతి అవుతోందంటే పారిశ్రామిక రంగం ఎంత అభివృద్ధి చెందిందో తెలిసిపోతుందని అభిప్రాయపడ్డారు. అదాని కంపెనీ వ్యవహారంలో కొంతమంది కావాలని కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాల పారిశ్రామిక వేత్తలకు అవకాశం రావాలన్నది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశమని, తమ నాయకుడు రాహుల్  గాంధీ, ఆదానీని  వ్యతిరేకించారు కానీ అభివృద్ధిని కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అదానీ పెట్టుబడులు ఉన్నాయని, వాళ్ళతో పాటు అనేక కంపెనీలు ఉన్నాయని, రాష్ట్ర అభివృద్దిపైనే తమ ఆలోచన ఉంటుంది కానీ వేరే కాదని అన్నారు. కరోనా వల్ల ఎంఎస్ఎంఈ పరిశ్రమలు చాలా ఇబ్బందిపడ్డాయని, కానీ అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందించలేకపోయాయని విమర్శించారు. తమ ప్రభుత్వం అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత చిన్న మధ్య తరగతి పరిశ్రమలకు మంచి తోడ్పాటు అందించేలా ముందుకు వెళ్తుందని భరోసా ఇచ్చారు. పారిశ్రామిక కారిడార్ విషయంలోనూ సలహలు, సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. చైనాను మించి మనం కూడా అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ది చేసుకోవచ్చిన అభిప్రాయపడ్డారు. పరిశ్రమలకు మళ్లీ నూతనోత్తేజాన్ని తీసుకురాబోతున్నామని ప్రకటించారు. అర్బన్ క్లస్టర్ , రీజనల్ క్లస్టర్ , సెమీ అర్బన్ క్లస్టర్, ఇలా మూడు పద్ధతుల్లో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించబోతున్నామని వివరించారు. డ్రైపోర్ట్ విషయంలో కూడా త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. నల్గొండతో పాటు కనెక్ట్ టూ ఓల్డ్ ముంబై హైవే ప్రాంతాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
Spread the love