కవిత్వం – సౌందర్యం

Poetry - Beautyమానవ సమాజం ఉన్నతిని మరింత పెంచేది సౌందర్య కవిత్వమా లేక కవిత్వ సౌందర్యమా ఏది ముందో ఏది వెనుకో కవిత్వ ప్రేమికులు, కవులు, విమర్శకులు తేల్చుకోవాలి. ఆ పిదపనే సాహిత్య సౌందర్య మూలాల అన్వేషణకు ఒక స్పష్టమైన తొవ్వ దారి దొరుకుతుంది. వర్తమాన కవిత్వం పోకడలను గమనంలోకి తీసుకుంటే అనేక అంశాలపై మరింత లోతైన చర్చ చేయవలసిన ఆవశ్యకత ఉందని అనిపిస్తున్నది.
పువ్వు పూయడం ఒక సౌందర్యం. ఆ పూలను తెంపుకొని స్రీలు కొప్పులో ధరించడం మరో సౌందర్యం. ఆ పూల మొక్కను పెంచి పెద్ద చేసి పూలను తెంపిన కూలీల చెమట శ్రమ సమాజ నిర్మాణ సౌందర్యం. ఇక్కడ మనం అంటే కవి ఏ సౌందర్యాన్ని ఆశిస్తున్నామన్నది, ఆస్వాదిస్తమన్నది ప్రధానం.
దానికన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది తేల్చుకోవాల్సింది మరొకటి ఉన్నది. అది సకల కళలు సమాజాన్ని ఊనిక చేసుకొని వికసిస్తాయా లేక సమాజం నుంచి మనిషిని విడదీసి కేవలం మనిషి ఉనికిని కేంద్రం చేసుకొని ఉత్పత్తి అవుతాయయా అనేది నేటి సాహిత్య కారుల ముందున్న ప్రశ్న. ఈ ప్రశ్నలను ఛేదించగలిగితే గానీ మిగతా విషయాలు అన్నీ దూద్‌ కా దూద్‌, పానీ కా పానీ, కుల్లం కుల్లా తెలుస్తుంది. ఈ చర్చ ఆది నుంచి ఉన్నప్పటికీ అంతిమంగా శ్రమ సౌందర్యమే పై చేయి సాదిస్తూ వస్తున్నది
సామాజిక శాస్త్రవేత్తలు యోచించాల్సిన అవసరం ఉన్నది. ఆధునికత, ఆధునికాంతరవాదం, ద్రవాధునికత ఇలా అనేక వాదాలు కళలను ఆసరా చేసుకుని అనేకానేక దోరణులు, వాదాలు, చర్చలు విశ్లేషణలు కొనసాగించాయి.
అయితే ఈ చర్చల విశ్లేషణ సారాంశమంతా ఉత్పత్తిలో జరిగిన మార్పు చేర్పుల యొక్క ఉపరితల అంశాలలో ఇమిడి ఉన్నాయి. అచ్చు యంత్రం సష్టి ఆధునిక శాస్త్రీయ ఆవిష్కరణలకు అంకురార్పణ చేసింది. శాస్త్రజ్ఞులు మనిషి తద్వారా సమాజం సర్వతోముఖోన్నతి కోసం నూతన ఆవిష్కరణలను కనుగొన్నాడు.. అత్యాధునికత ఆలంబన మూలాలు కంప్యూటర్‌ కనుగొన్న తర్వాత ప్రారంభమైందని ఉజ్జాయింపుగా మన సామాజిక విశ్లేషకులు ఒక అంచనాకు వచ్చారు. మొత్తానికి మొత్తంగా చూస్తే పెట్టుబడి కేంద్రంగా మనిషి వలసలు నిరంతరంగా కొనసాగాయి. అలాగే వాటి వెంట కవిత్వమూ సకల సజనాత్మక ప్రక్రియలు ప్రయాణించాయి. ఇవి కొన్నిసార్లు రాచరికానికి ఊడిగం చేస్తే మరికొన్నిసార్లు దేవాలయం చుట్టూ బాడుగకు వినిర్మితమైనవి. ఇలా ఆలోచిస్తే అక్షరాన్ని కొన్ని వర్గాలు తమ గుప్పిట్లో సంకెళ్లు వేసి కొన్ని వేల సంవత్సరాలు బంధించడం వలన ఇదంతా జరిగిందని అనిపిస్తున్నది. అక్షరాస్యులు, నిరక్షరాస్యుల మధ్య భేదాలు నిచ్చెన మెట్ల సమాజం ఆ వెంటే ఎక్కి వచ్చిన నిచ్చెనమెట్లను తన్నేసే తరం వచ్చింది. అంటే ఇక్కడే ఆధిపత్య కులాల ప్రాంతాల వారు ప్రయోజనాలు రక్షించుకునే విధంగా మిగితా ఉత్పత్తి కులాలకు మధ్య అంతరం అంటరానితనం ఏర్పచినారు. అంటే శ్రమ చేసేవారు కొందరైతే, కూర్చొని తినేవారు మరికొందరు ఈ సమాజాన్ని అవిచిన్నంగా ఏలారు. ఏది ఏమైనా పునాదిలో వచ్చిన ఉత్పత్తి సంబంధాల మార్పు ఉపరితలంలో కనబడుతున్న గందరగోళాలు అన్నిటికీ మనిషి లేక కవి కలత చెందే తక్షణ హదయ స్పందన అయిన కవిత్వంలో ప్రతిబింబించాయి.
ఇది ఏందని ప్రశ్నించిన మనిషి, కవి అన్ని కాలాలలో రాజ్యానికి కంటగింపుగా కనిపిస్తాడు. మతాలు, హింస, యుద్ధాలు, యుక్తులు, కుట్రలు, కుతంత్రాలు ప్రజ్వరిల్లాయి. మానవజాతి వికాస చరిత్రంతా భూమి ఉన్నవాడిదే ఆధిపత్యంగా కొనసాగింది.
ఇదిగో ఇక్కడే శ్రమ, పెట్టుబడి, అదనపు విలువల మధ్య ఒక సంఘర్షణ వాతావరణం నెలకొన్నది. పెట్టుబడి లాభాపేక్షతో అనేక దేశాలకు విస్తరించింది. ఆ వెంటనే సుజనాత్మక ప్రక్రియలను విభజించే ఆధునికత, ఆధునికాంతరవాదం, ద్రవాదునికత వాదాలు అన్ని సామాజిక సందర్భాలను సామాజిక శాస్త్రజ్ఞులు విశ్లేషణాత్మకంగా అనేక నూతన విషయాలను సమాజం ముందు విపులంగా అరటిపండులా ఒలిచి పెట్టారు, వింగడించారు.
రాచరికము మతం భూస్వామ్యము సోషలిజం ప్రజాస్వామ్యం పరిపాలన విధానాలు శాస్త్రీయంగా రాజనీతి శాస్త్రము తెలియజేసింది అలాగే ప్రజలు బానిసలు భూస్వామ్య కాలంలో వెట్టి కౌలు రైతులు కూలీలు అంతరాలు లేని సమాజం సోషలిజం ప్రజాస్వామ్యంలో పెట్టుబడిదారీ విధానం ముసుగులో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. అలాగే ఈ అన్ని దశలలో ఆయా వ్యవస్థలలో కవిత్వం కొనసాగుతూ వచ్చింది. రాజు బానిసలు భూస్వామ్యంలో చేతులు కట్టుకొని నిలబడే జనం ప్రజాస్వామ్యంలో ప్రజలు మనుగడ సాగించారు. ఆయా కాలాలను అణచివేత వాళ్లకు వ్యతిరేకంగా సజనాత్మక కళలు వర్ధిల్లాయి.
వారసత్వ రాజకీయాల లాగా వారసత్వ సాహిత్య కారులు కొనసాగారు. ఈ చట్రాన్ని బదాబదులు చేస్తూ మిగతా శ్రమ కులాల నుండి వారి వారి జీవిత సంఘర్షణలనం వాటిని పద్యంలో తెలుగు సాహిత్యంలో ముందు ఎప్పుడూ లేనంత తమ తమ జీవితం సాచివేత నుండి సుసంపన్నమైన సాహిత్యం పండిస్తున్నారు. సుమారు సాహిత్య చరిత్రలో తెలుగు సాహిత్యం యవనిక మీద అత్యద్భుతమైన దశ్యం కనిపిస్తున్నది.
చివరగా చెప్పేదేమంటే అంతిమంగా మనిషి సంఘజీవి మాత్రమే కాదు రాజకీయ జీవి కూడా అని తత్వవేత్తలు నిర్ధారించారు. ఈ నిర్ధారణతో రాజకీయాలకతీతంగా సాహిత్యం కవిత్వం ఉండడానికి వీలు లేదని, కాదనే పసలేని వాదనలు తేలిపోయాయి. ఇక్కడే అనుభూతివాదుల హదయ సంబంధమైన కవిత్వం పూర్వ పూర్వపక్షమైపోయింది. మొత్తంగా శ్రమ సౌందర్యం అంతిమంగా కవిత్వ సౌందర్యం పై చేయి సాధించింది.
కాబట్టి ప్రస్తుత వినియోగ సంస్కతీ సేవల భావంపైన నిలకడలేని స్థలంలో మనిషి కేవలం వినియోగదారుడుగా తన జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రస్తుత తరుణంలో అంతిమంగా శ్రమ మాత్రమే కవిత్వ సౌందర్యంగా బాసిస్తున్నదని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా కాలం గీటురాయి మీద అన్ని వాదాల కాలాలలో పరీక్షకు నిటారుగా నిలబడింది.
(నా ”ఒక కప్పు చారు నాలుగు మెస్సేజులు” కవితా సంకలనానికి ఈ 26న కొలకలూరి అవార్డు ప్రధానం స్సందర్భంగా…)
– జూకంటి జగన్నాథం, 9441078095

Spread the love