రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
రెవెన్యూ , విపత్తు నిర్వహణ అధికారులతో టెలికాన్ఫరెన్స్
అన్ని శాఖలూ సమన్వయం చేసుకోవాంటూ ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భారీ వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, విపత్తు నిర్వహణ అధికారులతో మంత్రి గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ జిల్లా స్ధాయిలో రెవెన్యూ యంత్రాంగం పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్, నీటిపారుదల, వైద్య ఆరోగ్య శాఖలతో సమన్వయం చేసుకుని నిరంతరం క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. వాగులు, వంకలు, చెరువులు, జలాశయాల వద్ద ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదకర ప్రాంతాల్లోని ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలు లేదా పునరావాస కేంద్రాలకు తరలించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే తక్షణమే స్పందించి సహాయక చర్యలు అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రవాణా, విద్యుత్, తాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా హైడ్రా, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల సాధారణ జీవనానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశామనీ, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశామని తెలిపారు. వచ్చే రెండ్రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.



