నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం రాజస్థాన్ పర్యటనలో భాగంగా జోధ్పూర్ విమానాశ్రయ కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ పాల్గొన్నారు. రూ. 480 కోట్లతో సుమారు 23,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టెర్మినల్, ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. ఈ టెర్మినల్ ఆధునిక ప్రయాణీకులను దృష్టిలో పెట్టుకుని.. ఎలాంటి అవాంతరాలు లేకుండా… వారికి సౌకర్యవంతంగా ఉండేలా దీన్ని నిర్మించడం జరిగిందని ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ఇది భారతదేశ పౌర విమానయాన రంగంలో ఒక కీలకమైన ముందడుగు. ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగ్రిక్) లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళుతుంది. ఈ పథకంలోని కొత్త నిబంధనలతో రాబోయే పదేళ్లలో రూ. 28,840 కోట్ల కేటాయింపుతో విమానయాన రంగం ఆధారిత అభివృద్ధి తదుపరి దశను వేగవంతం చేయడానికి ఈ ఉడాన్ పథకం లక్ష్యం అని ప్రధాని కార్యాలయ ప్రకటన పేర్కొంది.
కాగా, నేడు రాజస్థాన్లో మోడీ సుమారు 12.15 నిమిషాలకు బలోత్రాలో రూ. 1.06 లక్షల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతో పాటు, వాటిని ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా బలోత్రాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించనున్నారు.



