నవతెలంగాణ-ఆలేరు టౌను
2023 శాసనసభ ఎన్నికలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, మలిదశ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమకారులు ముక్తకంఠంతో కోరారు. బుధవారం ఆలేర్ పట్టణంలో రహదారి బంగ్లా వద్ద వారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే 250 గజాల స్థలం, పింఛన్, తెలంగాణ స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించి హెల్త్ కార్డు, ప్రత్యేక గుర్తింపు కార్డు ఇస్తామని చెప్పిన మాట వాస్తవం అన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇటీవల ఉద్యమకారుల కోసం ఒక మంత్రివర్గ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.
కమిటీ వేసిన చాలా రోజులకు ఒక సమావేశం నిర్వహించారని, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి, అనేక వర్గాల నుంచి అభిప్రాయం తీసుకుంటున్నటువంటి సందర్భంగా ఆలేరు తెలంగాణ ఉద్యమకారుల పక్షాన, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్రం కోసం ఈ ఆలేరు ప్రాంతంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డ తీరును, సబ్బండ వర్గాలు, జాతులు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, అనేకమంది వివిధ రకాల కేసుల్లో జైలుకు పాలయ్యారని చెప్పారు. ఉద్యమకారుల కోసం ఏర్పాటైన కమిటీ నిర్దిష్టంగా, ఎలాంటి పక్షపాత ధోరణి చూపకుండా ఉద్యమకారులకు న్యాయం చేయాలన్నారు.
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, బీర్ల ఐలయ్య ఉద్యమకారులకు తగు న్యాయం చేసేలా ప్రభుత్వంతో మాట్లాడాలన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు ఆడకు బాలస్వామి, జిల్లా నాయకులు రచ్చ రామ్ నరసయ్య, యేలుగల కుమారస్వామి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సీస మహేశ్వరి, మాజీ ఎంపీపీ కాసగళ్ల అనసూయ, మొరిగాడి సుజాత, నాయకులు దొంతుల ఎల్లేష్, పుట్టల కిష్టయ్య, నీల రామన్న, గుజ్జు అశోక్ తదితరులు పాల్గొన్నారు.



