– సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
– పాల్గొన్న జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) అశ్వారావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీవో వాల్మీకి కిశోర్ కు అందజేశారు.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం)నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య మాట్లాడుతూ.. రైతులకు హామీ ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీని ఎలాంటి షరతులు లేకుండా సంపూర్ణంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. భూమిలేని వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని, అర్హులైన ప్రతి కుటుంబంలోని మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వాలని కోరారు. ఇంటి స్థలం లేని పేదలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
పోడు సాగుదారులకు పట్టా హక్కు పత్రాలు అందించాలని, పోడు రైతులు సాగు చేస్తున్న పంటలను అటవీశాఖ అధికారులు ధ్వంసం చేయడం, పంటలను పీకేయడం వంటి చర్యలను వెంటనే నిలిపివేయాలని నాయకులు కోరారు. ప్రజలకు, రైతులకు, కూలీలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బుడితి చిరంజీవి, మండల కార్యదర్శి సోడెం ప్రసాద్,మున్సిపల్ కౌన్సిలర్ తగరం నిర్మల,మండల కార్యదర్శి వర్గ సభ్యులు మడకం గోవిందు,మడిపల్లి వెంకటేశ్వరరావు, మండల కమిటీ సభ్యులు మొడియం దుర్గా రావు తో పాటు మహిళలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



