ఢిల్లీలో దామన్న..పేటలో ప్రచార రథానికి పూజలు చేసిన రమేషన్న

– టిక్కెట్ ఎవ్వరికి దక్కునో…
– కార్యకర్తలో ఉత్కంఠ
నవతెలంగాణ-సూర్యాపేట : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా కసరత్తు గత కొన్ని రోజుల నుండి కొనసాగుతూనే ఉన్నది. ఇందుకుగాను కొన్ని రోజులు హైదరాబాదులో మరికొన్ని రోజులు ఢిల్లీలో అభ్యర్థుల వడపోత కార్యక్రమాన్ని  నిర్వహించారు. అభ్యర్థుల ఎంపిక వారికి కత్తి మీద సాముల మారింది. ప్రధానంగా మాజీ మంత్రి,టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి, బీసీ నేతలు తండు శ్రీనివాస్ యాదవ్, ఎలగందుల రాము, ముషం రవి కుమార్ లు సూర్యాపేట టిక్కెట్ ఆశిస్తూ దరఖాస్తులు చేసుకున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఎన్నికల స్టీరింగ్ కమిటీ అభ్యర్థుల వడపోత నిర్వహించింది. కాగా వడపోత జాబితా ను ఏఐసీసీ కి పంపడం జరిగింది.ఈ నేపథ్యంలో డిల్లీ లో అభ్యర్థుల వడపోత ను బుధవారం,గురువారం లు సీడబ్ల్యూసీ చేపట్టింది.ఈ నేపథ్యంలో దామోదర్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు.అక్కడ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కమిటి సభ్యులు నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని దామన్న మర్యాద పూర్వకంగా కలిశారు. అదేవిధంగా అక్కడే మరికొందరు అగ్ర నేతలను కలిసి దామన్న టిక్కెట్ పై పట్టు సాధించేందుకు వ్యహాత్మకంగా వ్యహరిస్తున్నట్లు తెలుస్తోంది. టిక్కెట్ పై పూర్తి భరోసా తో దామన్న ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా ఈనెల చివరి లో మొదటి జాబితా విడుదల అయ్యే అవకాశం ఉంది.మొదటి జాబితాలో నే తన పేరు ఉంటుందనే కాన్ఫిడెంట్ తో దామన్న ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి మాత్రం గురువారం  సూర్యాపేటలోని శ్రీ వేంకటేశ్వర దేవాలయం వద్ద 20 లక్షలతో కొనుగోలు చేసిన ఎన్నికల ప్రచార రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోటా లో వంద శాతం టిక్కెట్ తనదే అనే ధీమాతో ఆయన ఎన్నికల ప్రచారానికి సిద్ధపడుతున్నారు. ఒకవైపు దామన్న ఢిల్లీలో పూర్తి భరోసా తో ఉండగా రమేష్ రెడ్డి ఏకంగా ప్రచార రథాన్ని ప్రాంభించుకొని ఎన్నికల రణరంగానికి సిద్ద పడడం గమన్హారo.ఇరువురు కూడా టిక్కెట్ పై పూర్తి నమ్మకంతో ఉండడంతో జిల్లా కేంద్రంలో ఉత్కంఠ నెలకొంది. ఒకరినిమించి ఒకరు టిక్కెట్ విషయంలో తగ్గేదెలే…అంటూ పోటీపడుతున్నారు. కాగ అభ్యర్థుల ఎంపిక.. వడపోత సమయంలో సూర్యాపేట టిక్కెట్ ఫైనల్ చేయడం కమిటీ సభ్యులకు కత్తి మీద సాములా మారే అవకాశం ఉంది. ఈ కమిటీ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు రేవంత్ రెడ్డి తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉండనున్నారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం దామోదర్ రెడ్డి పేరును ప్రతిపాదించే అవకాశం ఉంది. ఇక రేవంత్ మాత్రం రమేశ్ రెడ్డి కోసం పట్టు బట్టే అవకాశం ఉంది,ఇక కోమటిరెడ్డి నిర్ణయం ఏవిధంగా ఉంటుందో చూడాలి.అగ్ర నేతలు ఢిల్లీలో మకాం వేయడంతో టిక్కెట్ ఎవరికి దక్కుతుందా అనే ఉత్కంఠ నెలకొంది.ఈ క్రమంలోనే సూర్యాపేట టికెట్ మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఈ టికెట్ ప్రకటనతోనే సూర్యాపేటలో విజయ అవకాశాలు ఎవర్ని వరించనున్నాయో తేలే అవకాశం ఉంది.సీనియర్లు, జూనియర్ల వార్ నేపథ్యంలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో చూడాలి.ఈ క్రమంలోనే టిక్కెట్  నాదే గెలుపు నాదే అనే ధీమాతో దామోదర్ రెడ్డి మొదటి నుండి కూడా నిండు కుండలా తోనకుండా, బేనక కుండా వ్యవహరిస్తున్నారు. రమేష్ రెడ్డి మాత్రం తన పట్టు ను ఏ మాత్రం సడలించకుండా  టికెట్ కోసం పోరాడుతున్నారు.ఎవ్వరికి వారు టిక్కెట్ పై నమ్మకంతో దైర్యంగా తమ తమ ప్రయత్నాలను విస్తృత పరుస్తున్నారు. వీరి వ్యవహారంతో టిక్కెట్ ప్రకటనపై కార్యకర్తలలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.
Spread the love