నవతెలంగాణ – హైదరాబాద్ : కొత్త పింఛన్ కోసం ఎదురుచూస్తున్న అర్హులకు తెలంగాణ ప్రభుత్వం ఊరటనిచ్చింది. దరఖాస్తు సమయంలో ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో లేకపోయినా.. వాటి కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ముందుగా కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం, సెర్ప్ వెల్లడించింది. దీంతో సర్టిఫికెట్లు రావడంలో జాప్యం కారణంగా దరఖాస్తు గడువు మిస్ అవుతుందేమోనని ఆందోళన చెందుతున్న వారికి ఉపశమనం లభించింది.
ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే దివ్యాంగుల సర్టిఫికెట్లు, కులం, ఆదాయం, మరణ ధ్రువీకరణ పత్రాలు పొందడంలో ఆలస్యం జరుగుతున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. రెవెన్యూ, తహసీల్దార్ కార్యాలయాలు, సదరం క్యాంపుల నుంచి సర్టిఫికెట్లు పొందేందుకు సమయం పడుతుండటంతో అర్హులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సర్టిఫికెట్ల కోసం ఆగకుండా ముందుగా ఆన్లైన్లో లేదా నిర్దేశిత మీసేవా కేంద్రాల్లో కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకోవచ్చని సెర్ప్ స్పష్టం చేసింది. అయితే ఇక్కడే ఓ కీలక నిబంధన ఉంది.



