నిబంధనలు అతిక్రమించారని రూ. 64లక్షల పెనాల్టీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రియల్ ఎస్టేట్ సంస్థలపై తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యూలేటరీ అథారిటీ (రెరా) మరోసారి కొరడా ఝుళిపించింది. నిబంధనలు అతిక్రమించిన మూడు రియల్ ఎస్టేట్ సంస్థలకు పెనాల్టీ విధించింది. బుధవారం హైదరాబాద్లోని రెరా కార్యాలయంలో అందిన ఫిర్యాదులపై విచారణ జరిపి రూ. 64 లక్షల జరిమానా విధించింది. రిజిస్ర్టేషన్ లేకుండా ప్లాట్ల అమ్మకాలను సాగిస్తున్నట్టు రెరాకు ఫిర్యాదులు అందాయి. అంతేకాక నిర్మాణాలకు ముందుగా పది శాతం సొమ్మును తీసుకోవాల్సిన సంస్థలు 25 శాతం వసూలు చేస్తున్నాయి. ఇది చట్టాన్ని ఉల్లఘించడమేనని రెరా అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే ఏవీస్ ఇఫ్రాకాన్ ప్రయివేట్ లిమిటెడ్కు చెందిన ఏవీస్ ఈస్ట్ రెసిడెన్సీ ప్రాజెక్టుపై రూ. 2,83,140 పెనాల్టీ, ఏవీస్ వెస్ట్ హైట్స్ ప్రాజెక్టుపై రూ. 14, 84,184 జరిమానాను విధించింది. ప్లాట్ కొనుగోలుదారులకు సేల్ అగ్రిమెంట్ చేయకుండానే వారి నుంచి 25 శాతం ముందుగానే వసూలు చేసిన అధూరి ఇన్ఫ్రాకు రూ. 6,77,966 జరిమానా వేసింది. ఎస్వీఎం ఆదిత్య హోమ్స్కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ఒక అడుగు ముందుకేసి రెరా రిజిస్ట్రేషన్తోపాటు హెచ్ఎండీఏ అనుమతి తీసుకోకుండా ప్లాట్ల అమ్మకాలను సాగిస్తున్నది. ఈ సంస్థపై రెరా రూ. 43,16,480 భారీ పెనాల్టీని విధించింది. రెరా నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్కు సంబంధించిన ప్రకటనలు ఇవ్వడం, మార్కెటింగ్ చేయడం, ప్లాట్ల బుకింగులు చేయడాన్ని రేరా తప్పుపట్టింది. విక్రయాలు చేసే ముందు తప్పనిసరిగా రెరా అనుమతి పొందాలని సూచించింది. దీంతోపాటు సేల్ అగ్రిమెంట్ చేయకుండా కొనుగోలుదారుల నుంచి అగ్రిమెంట్ మొత్తం విలువలో పది శాతం కంటే డబ్బు వసూలు చేయకూడదని మరోసారి స్పష్టం చేసింది.
రియల్ ఎస్టేట్ సంస్థలపై రెరా కొరడా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



