రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి
2014 నుంచి బకాయిలను వెంటనే చెల్లించాలి
తెలంగాణ ఉద్యమకారుడు సయ్యద్ రఫీ, రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పాడి గణపతిరెడ్డి
నవతెలంగాణ – ముషీరాబాద్
రైస్ మిల్లర్ల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేదంటే ఈ నెల 11 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మిల్లులను బంద్ చేస్తామని తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక కార్యకర్త సయ్యద్ రఫీ, రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పాడి గణపతిరెడ్డి అన్నారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్లో మంగళవారం అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సయ్యద్ రఫీ మాట్లాడుతూ.. రైస్ మిల్లింగ్ రంగం రైతులు, కార్మికుల ప్రయోజనాలతో ముడిపడి ఉందన్నారు. మిల్లర్లపై ఆకస్మిక తనిఖీలు, దాడులను నిలిపివేసి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. సీఎంఆర్ ఒప్పందాలను న్యాయబద్ధంగా రూపొందించి, ధాన్యం రకం, నాణ్యత ఆధారంగా బియ్యం దిగుబడి నిష్పత్తిని నిర్ణయించాలని స్పష్టం చేశారు. పాడి గణపతిరెడ్డి మాట్లాడుతూ.. 2014 నుంచి పెండింగ్లో ఉన్న మిల్లింగ్, రవాణా, డ్రైయేజ్ తదితర బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. క్వింటాల్కు మిల్లింగ్ చార్జీని రూ.150గా నిర్ణయించాలని, 25 శాతం జరిమానా, 12 శాతం వడ్డీ మాఫీ చేయాలని కోరారు. మిల్లింగ్ రంగానికి అనుకూలమైన విధానాలను ప్రభుత్వం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఉట్కూరు వీరేశం, కోశాధికారి విశ్వనాథం వెంకటరమణ, మల్లేశం, సత్యనారాయణ, బుచ్చిరామ్, నాగరాజు, కిష్టయ్య, వివిధ జిల్లాల రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.
11 నుంచి రైస్ మిల్లుల బంద్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



