అత్తకు రూ.5 వేలు, కోడళ్లకు రూ.3 వేలు

అత్తకు రూ.5 వేలు, కోడళ్లకు రూ.3 వేలు– పచ్చి రాజకీయ అవకాశవాది రాజగోపాల్‌రెడ్డిని ఓడించాలి
– కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆగమాగం
– చౌటుప్పల్‌, కోదాడ రోడ్‌షోల్లో కేటీఆర్‌
నవతెలంగాణ-కోదాడరూరల్‌, చౌటుప్పల్‌
డబ్బు ప్రలోభాలతో ప్రజలను మోసం చేసేందుకు వచ్చిన పచ్చి రాజకీయ అవకాశవాదులు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులు కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఓడించాలని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పిలుపు నిచ్చారు. డిసెంబర్‌ 3 తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు సౌభాగ్య లక్ష్మి పథకం కింద.. కోడళ్ళకు రూ. 3000, ఆసరా పింఛన్‌ అందుకుంటున్న అత్తలకు రూ.5000 పెన్షన్‌ ఇవ్వబోతున్నట్టు తెలిపారు. బుధవారం సూర్యాపేట, యాద్రాద్రి జిల్లాలోని చౌటుప్పల్‌, కోదాడ పట్టణాల్లో నిర్వహించిన రోడ్‌ షోలలో కేటీఆర్‌ పాల్గొని మాట్లాడారు. కేసీఆర్‌ వల్లే కాళేశ్వరం నుంచి ఇక్కడికి నీళ్లు వస్తున్నాయని తెలిపారు. కోదాడలో బీజేపీకి అభ్యర్థి లేకనే జనసేనకు ఇచ్చారని ఎద్దేవా చేశారు. మోడీ ఆరోజు సిలిండర్‌కు మొక్కి ఓటు వేయాలని చెప్పిండని, అనంతరం మన నెత్తిమీద కూర్చుని రూ.600 సిలిండర్‌ రూ.1200 చేశాడని ఆరోపించారు. ఇక్కడ పాలిటెక్నిక్‌ కాలేజీ కూడా వస్తుందన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఆకలి చావులు, ఆత్మహత్యలు అని అన్నారు.
ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే నందమూరి తారకరామారావు పార్టీ పెట్టారో ఇప్పుడు టీడీపీ వాళ్లు ఆ పార్టీకి ఓటేస్తారా అని ప్రశ్నించారు. 55 ఏండ్ల కాంగ్రెస్‌ పాలనలో మునుగోడు ప్రజలకు ఫ్లోరిన్‌ నీరు తాగించారని, దాంతో వారి కాళ్లు, చేతులు వంకర్లు పోయి అనేక అనారోగ్యాలకు గురయ్యారన్నారు. చౌటుప్పల్‌ పట్టణంలో మిషన్‌ భగీరథ పైలాన్‌ ఏర్పాటుచేసి మంచినీరు అందించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. కాంగ్రెస్‌ వస్తే కరెంట్‌ కష్టాలు వస్తాయన్నారు. ఇప్పుడు మళ్లీ ఛాన్స్‌ ఇస్తే ఎరువుల కోసం దుకాణాల ముందు క్యూలో నిలబడాలా, కరెంట్‌ కోసం అర్ధరాత్రి మళ్లీ పొలాల వద్దకు వెళ్లి పాములు, తేళ్లు కరిచి చనిపోవాలా అని ప్రశ్నించారు. కేవలం డబ్బుల కోసం రాజకీయాలు చేసి డబ్బులతోనే జనాలను కొనొచ్చని భావిస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఓడించి తగిన బుద్దిచెప్పాలన్నారు.

Spread the love