హైకోర్టు తీర్పుకు అనుగుణంగా బకాయిలు చెల్లించాలి: ఆర్టీసీ అధికారులు

నవతెలంగాణ – ఆర్మూర్  

వారం రోజుల వ్యవధిలోనే ఆర్టీసీ అధికారులు జీవన్ రెడ్డి మాల్ కు హెచ్చరికలు జారీ చేయడం, గురువారం మాల్ ప్రధాన గేటుకు విజిలెన్స్ టీఎస్ఆర్టీసీ అధికారులు సీజ్ చేయడం తీవ్ర సంచలనం రేపింది. ప్రభుత్వ యంత్రాంగం పవర్ఫుల్ యాక్షన్ మొదలుపెట్టినట్టు స్థానికులు చర్చించుకుంటున్నారు. గత గురువారం 9వ తేదీ టిఎస్ఆర్టిసి అధికారులు మాల్ కు వెళ్లి నోటీసులు ఇవ్వగా సరిగ్గా వారం తర్వాత గురువారం పోలీస్ సిబ్బందితో రావడం హాట్ గా మారింది..

వివరాలు ఇలా ఉన్నవి..

బస్‌ స్టేషన్‌ సమీపంలోని 7059 చదరపు గజాల భూమిని విష్ణుజిత్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) అద్దెకు ఇస్తూ ఒక ఒప్పందం చేసుకుంది. ప్రత్యామ్నాయ రెవెన్యూ పెంచుకునేందుకు గాను ౩౩ సంవత్సరాలకు బిల్ట్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌(బీవోటీ) కింద 01.06.2013న ఆ భూమిని లీజ్‌కు ఇవ్వడం జరిగింది. ఆ స్థలంలో ఒక షాపింగ్‌ మాల్‌ను ఆ కంపెనీ డెవలప్‌ చేసింది. 2017లో విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సతీమణి రజితా రెడ్డి టేక్ఓవర్‌ చేసుకుని.. షాపింగ్‌ మాల్‌కు జీవన్‌ రెడ్డి మాల్‌ అండ్‌ మల్టీపెక్స్‌ గా పేరుపెట్టారు. థర్డ్‌ పార్టీలకు అందులోని స్టాళ్లను లీజ్‌కు ఇచ్చారు.
ఒప్పందం ప్రకారం ఆ కంపెనీ సకాలంలో అద్దె చెల్లించలేదు. 2015 అక్టోబర్‌ వరకు రూ.4.30 కోట్ల బకాయిను సంస్థకు పడింది. దీంతో అప్పుడే టెర్మినేషన్‌ ఆర్డర్‌ను సంస్థ జారీ చేసింది. దీంతో రెండు పర్యాయాలు రూ.69 లక్షలను చెల్లించారు. మిగతా బకాయిలను చెల్లించాలని పలుసార్లు నోటీసులు పంపించిన స్పందించలేదు. గత ఏడాది అక్టోబర్‌  వరకు రూ.8.65 కోట్ల బకాయిలు ఉన్నాయి. మళ్లీ నోటీసులు జారీ చేయడంతో.. అక్టోబర్‌ లో రూ.1.50 కోట్లను ఆ కంపెనీ చెల్లించింది. ఆ తర్వాత షోకాజ్‌ నోటీసులు పంపించడంతో గత ఏడాది డిసెంబర్‌ లో విడతల వారీగా రూ.2.40 కోట్లను కట్టారు. షోకాజ్‌ నోటీసును సవాల్‌ చేస్తూ  హైకోర్టును వారు ఆశ్రయించారు. టీఎస్ఆర్టీసీకి బకాయిలు చెల్లించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో విడతల వారీగా రెండు కోట్లను చెల్లించారు. ఈ కేసుపై బకాయిలన్నీ నెల రోజుల్లో చెల్లించాలని మార్చి 27న హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది ప్రజల డబ్బు అని స్పష్టం చేసింది. బకాయిలు చెల్లించకుంటే నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని సంస్థను ఆదేశించింది. నెల రోజుల గడువు పూర్తయిన మొత్తం బకాయిను ఆ కంపెనీ చెల్లించలేదు. ఇప్పటివరకు రూ.2.51 కోట్ల అద్దె బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు  ఈ నెల 9వ తేదిన నోటీసులు ఇవ్వడానికి ఆర్టీసీ అధికారులు షాపింగ్‌ మాల్‌ కు వెళ్లారు. ఆ మాల్‌ లో థర్డ్‌ పార్టీ స్టాళ్లు ఉండటంతో వారికి సమాచారం ఇచ్చేందుకు మైక్‌ లో అనౌన్స్‌ చేసినారు.
వాస్తవాలు ఇలా ఉంటే.. శుక్రవారం నిజామాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించి టీఎస్ఆర్టీసీ, సంస్థ ఉన్నతాధికారులపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేశారని. ఇష్టానుసారంగా నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే సంస్థ వదిలేస్తోంది. అని అద్దె బకాయిల విషయంలో లీజ్‌ ఒప్పందం, హైకోర్టు ఆదేశాల ప్రకారమే సంస్థ నడుచుకుంటోందని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. బకాయిలు చెల్లించాలని గత 5 సంవత్సరాలుగా 20కి పైగా నోటీసులను సంస్థ జారీ చేసింది. తమకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని ఆరోపించడంలో ఏమాత్రం నిజం లేదు. జీఎస్టీ కేంద్రానికి చెల్లించడం లేదనడం పూర్తి అర్ధరహితం. నిబంధనల ప్రకారమే క్రమంతప్పకుండా జీఎస్టీని కేంద్రానికి సంస్థ చెల్లిస్తోంది. అని, బకాయిల విషయంలో సంస్థ ఏమాత్రం రాజీ పడటం లేదు. నిబంధనల మేరకే వాటిని వసూలు చేయడం జరుగుతోంది. ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించకుండా ఉద్దేశపూర్వకంగా సంస్థపై, ఉన్నతాధికారులపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం సరికాదు సరికాదని స్పష్టం చేసినారు. కాగా గురువారం సాయంత్రం ప్రధాన గేటుకు విజిలెన్స్ టిఎస్ఆర్టిసి అధికారులు తాళం వేయడం మాజీ ఎమ్మెల్యే తో పాటు బిఆర్ఎస్ నేతలకు షాక్ తగిలింది.
Spread the love