న్యూఢిల్లీ : దిగ్గజ విత్త సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఫిక్స్డ్ డిపాజిట్దారులకు శుభవార్త తెలిపింది. ఎఫ్డిలపై వడ్డీ రేట్లను పెంచింది. సవరించిన వడ్డీ రేట్లు మే 15 నుంచి అమల్లోకి వచ్చాయని ఆ సంస్థ వెబ్సైట్లో తెలిపింది. కాలపరిమితిని బట్టి రూ.2 కోట్ల లోపు రిటైల్ డిపాజిట్లపై గరిష్టంగా 75 బేసిక్ పాయింట్ల (0.75 శాతం) మేరకు వడ్డీ పెంచింది. 46 రోజుల నుంచి 179 రోజుల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 4.75 శాతం నుంచి 5.50 శాతానికి వడ్డీ రేటును చేర్చగా.. సీనియర్ సిటిజన్లకు 5.25 నుంచి 6 శాతానికి పెరిగింది. 180-210 రోజుల గడువు గల ఎఫ్డిలపై 6శాతం, సీనియర్ సిటిజన్లకు 6.5శాతం వడ్డీ అందించనున్నట్లు పేర్కొంది. 211 రోజుల నుంచి ఏడాది లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై 6 శాతం నుంచి 6.25 శాతానికి, సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం ఆఫర్ చేస్తోంది. అదే విధంగా రూ.2 కోట్ల పైబడిన బల్క్ డిపాజిట్లపై వడ్డీ 25 బేసిస్ పాయింట్లు పెంచి కాలపరిమితిని బట్టి 5.25 శాతం నుంచి 6.75 శాతం మధ్య వడ్డీ అందించనున్నట్లు ఎస్బిఐ తెలిపింది.