అధిక ధరలకు మందులు అమ్మకం

– డీసీఏ దాడుల్లో పట్టివేత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నిర్దేశించిన ధర కన్నా ఎక్కువ ధరకు అమ్ముతున్న మందులను డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్‌ అంబర్‌పేటలోని ఒక మెడికల్‌ షాప్‌లో దాడి చేసిి ఇట్వేజ్‌-200 క్యాప్స్సుల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిని పాట్నానగర్‌లోని టాస్క్‌ ఇంటర్నేషనల్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ తయారు చేస్తుండగా, చెన్నైలోని స్కినోసియన్‌ ఫార్మాస్యుటికల్స్‌ మార్కెటింగ్‌ చేస్తున్నది. దీనిని ఎంఆర్పీ రూ.299కిగా లేబుల్‌పై ముద్రించి అమ్ముతున్నారు. ఇది డ్రగ్స్‌ (ప్రైస్‌ కంట్రోల్‌ ) ఆర్డర్‌, 2013ను ఉల్లంఘించినట్టని అధికారులు తెలిపారు. ఇట్రాకాన్‌ జోల్‌ క్యాప్సుల్స్‌ 200 ఎంజీని ఒక్కో క్యాప్సుల్‌ను రూ.22.12 చొప్పున 10 క్యాప్సుల్స్‌ ను రూ.221.2కు అమ్మాలని కేంద్ర ప్రభుత్వం సీలింగ్‌ విధించింది. దీనికి జీఎస్టీ 12 శాతం కలుపుకున్నా రూ.247.74కు మించకుండా అమ్మాల్సి ఉంటుంది. అయితే 10 క్యాప్సుల్స్‌ను రూ.51.25 అధికంగా కలిపి అమ్ముతున్నారు. దీంతో అధికారులు మందులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love