సీటీఓ సునీల్‌ పొత్తూరి చేరికతో తమ నాయకత్వ బృందాన్ని బలోపేతం చేసిన సిద్స్‌ ఫార్మ్‌

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న డెయిరీ బ్రాండ్‌, సిద్స్‌ ఫార్మ్‌ తమ నూతన  చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (సీటీఓ)గా సునీల్‌ పొత్తూరిని నియమించుకున్నట్లు వెల్లడించింది. కన్సల్టింగ్‌, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌, స్ట్రాటజీ, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌ లో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం సునీల్‌కు ఉంది. వ్యాపార నిర్వహణలో ఆయనకున్న అశేష అనుభవం, సాంకేతిక నేపథ్యం వంటివి ఆవిష్కరణలు, వృద్ధి పట్ల సిద్స్‌ ఫార్మ్‌ లక్ష్యం చేరుకోవడానికి తోడ్పడనున్నాయి. సిద్స్‌ ఫార్మ్‌లో చేరక మునుపు సింటెలియో సహ వ్యవస్థాపకుడు, సీఈఓగా వ్యవహరించిన ఆయన స్టార్టప్‌ సలహాదారునిగా కూడా గుర్తింపు పొందారు. కెరీర్‌ తొలినాళ్లలో  లాస్‌ ఏంజెల్స్‌లోని డెలాయిట్‌లో కన్సల్టింగ్‌లో ఉద్యోగం చేసిన సునీల్‌ , టెక్నాలజీ , ఆపరేషన్స్‌ బృందాలకు నేతృత్వం వహించారు. అనంతర కాలంలో మీడియామింట్‌లో చీఫ్‌ డెలివరీ ఆఫీసర్‌గా డిజిటల్‌ మార్కెటింగ్‌, టెక్నాలజీ సేవలను అందించారు. హైదరాబాద్‌లోని సీబీఐటీ లో ఇంజినీరింగ్‌ చేసిన సునీల్‌, అహ్మదాబాద్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ చేశారు. సిద్స్‌ ఫార్మ్‌ వ్యవస్ధాపకుడు డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ సునీల్‌ యొక్క వ్యూహాత్మక లక్ష్యాలు, సాంకేతికత పట్ల అభిరుచి అత్యున్నత నాణ్యతకలిగిన ఉత్పత్తులు, సేవలు అందించాలనే తమ లక్ష్యంకు అనుగుణంగా ఉన్నాయన్నారు. ఆయన అనుభవం తమ భవిష్యత్‌ వృద్ధి, ఆవిష్కరణలలో కీలకం కానుందని వెల్లడించారు. సునీల్‌ పొత్తూరి మాట్లాడుతూ సీటీఓగా సిద్స్‌ ఫార్మ్‌లో చేరడం సంతోషంగా ఉందన్నారు, సంస్థ వ్యూహాత్మక లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతిభావంతులైన సిద్స్‌ ఫార్మ్‌ టీమ్‌తో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా చూస్తున్నామన్నారు.

Spread the love