– ‘నైనీ’ ఉత్పత్తి కోసం కార్యాచరణ
– అటవీ భూమి కోసం అధికారులతో చర్చలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సింగరేణి సీఎమ్డీ ఎన్ బలరాంనాయక్ సోమవారం ఒడిశా రాష్ట్రానికి వెళ్లారు. నైనీ ప్రాజెక్ట్ అనుమతుల కోసం అక్కడి ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఆయన విజ్ఞప్తికి ఒడిశా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ జెనా సానుకూలంగా స్పందించారు. ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఒడిశా రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పనా సంస్థ (ఇడ్కో ) చైర్మెన్ హేమంత్శర్మను కూడా కలిశారు. సింగరేణి సంస్థ ఒడిశా రాష్ట్రంలో చేపట్టిన నైనీ బొగ్గు గని నుంచి ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం చివరి నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని కృతనిశ్చయంతో ఉంది. అలాగే నైనీ సమీపంలో నిర్మించతలపెట్టిన థర్మల్ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన స్థలం గుర్తింపు కోసం కూడా సీఎమ్డీ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో భేటీ అయ్యి నైనీ బ్లాక్కు సంబంధించి రెండో దశ అటవీ అనుమతులపై చర్చించారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టు వన్య ప్రాణి నిర్వహణ ప్రణాళికలో భాగంగా రూ.39 కోట్లను డిపాజిట్ చేశామనీ, దీంతో ఇప్పటి వరకు రూ.180 కోట్లను పూర్తిగా ప్రభుత్వానికి చెల్లించినట్లు ఆయన తెలిపారు. ప్రాజెక్టు ప్రారంభం కోసం కావాల్సిన 783 హెక్టార్ల అటవీ భూమిని సింగరేణికి బదలాయించాలని కోరారు. సింగరేణి ఆధ్వర్యంలో నైనీ ప్రాజెక్టుకు 50 కిలోమీటర్ల దూరంలో 1,600 (2ఞ800) మెగావాట్ల థర్మల్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.దీనికోసం 800 ఎకరాల స్థలం అవసరం ఉంటుందన్నారు. సంబంధిత భూములకు సంబంధించిన ప్రభుత్వం నుంచి సహకారం కావాలని కోరారు. అనంతరం ఇడ్కో సీజీఎం(ల్యాండ్) సరోజ్ కుమార్ సేథీతో మాట్లాడారు. అక్కడి నుంచి ఒడిశా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ సుశాంత్ నందాను కలిసి అటవీ భూమి బదలాయింపు కోరారు.
ఈ సందర్భంగా సీఎమ్డీ బలరాం మాట్లాడుతూ అటవీ భూమి బదలాయింపు జరిగితే మూడు నెలల్లో బొగ్గు ఉత్పత్తి మొదలవుతుందని తెలిపారు. ఈ పర్యటనలో ఆయన వెంట నైనీ జీఎం తుమ్మలపల్లి శ్రీనివాసరావు, జీఎం (ఎస్టేట్స్) బండి వెంకటయ్య, చీఫ్ ఆఫ్ పవర్ ప్రాజెక్ట్స్ విశ్వనాథరాజు, ప్రాజెక్టు ఆఫీసర్ ఎస్.మజుందార్, ఎస్ఈ(మైనింగ్) ప్రవీణ్ కశ్యప్ తదితరులు ఉన్నారు.