నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
విద్యార్థులు శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించుకోవాలని సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జాతీయ కమిటీ నాయకుడు ఉప్పులేటి నరేష్ అన్నారు. గురువారం కమిషనర్ అనురాధ ఆదేశాల మేరకు హుస్నాబాద్ ఎస్సై తోట మహేష్ ఆధ్వర్యంలోమండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల విద్యాలయంలో వ్యక్తిత్వ వికాసం- మూఢనమ్మకాల నిర్మూలన అనే అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన నరేష్ మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇప్పటికీ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలు నమ్మడం దురదృష్టకరమని అన్నారు. విద్యార్థి దశలోనే మూఢనమ్మకాలు వీడుతూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని, దొంగ స్వాములు భూత వైద్యులు ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఆర్థికంగా మోసం చేస్తున్నారని అన్నారు. దయ్యాలు భూతాలు మంత్రాలు బూటకమని, సైన్స్ ను సైనికుడిలా విద్యార్థులు ముందుకు నడవాలని సూచించారు. విద్యార్థి దశలోని ఉన్నత చదువులతో మీతల్లిదండ్రుల లక్ష్యాలను నెరవేర్చాలని విద్యార్థులకు వివరించారు. సైన్స్ మ్యాజిక్ షో నిర్వహించిన నరేష్ ఇనుప కత్తిని కడుపులో గుచ్చుకోవడం, విద్యార్థి చేతి పై కిరోసిన్ తో కాల్చడం, నోట్లో మంటలు లేపడం, గాలిలో విభూది సృష్టించడం, పేపర్లు కాల్చి చాక్లెట్లు చేయడం, విద్యార్థి వాచిని మాయం చేసి రింగు తీసి ఇవ్వడం, లాంటి అనేక ప్రదర్శనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ మనెమ్మ, ప్రిన్సిపల్ మమత , పోలీస్ సిబ్బంది అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.