ఆయిల్ ఫాం రైతులను ఆదుకోండి..

– మంత్రి తుమ్మలకు ఆయిల్ ఫాం గ్రోయర్స్ సొసైటీ విన్నపం
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆయిల్ ఫాం గెలలు దిగుబడి తగ్గుదల తో పాటు ఏ నెల కా నెల తగ్గుతున్న గెలలు ధరలు దృష్ట్యా, గెలలు కు కనీస మద్దతు ధర కల్పించి ప్రభుత్వ పరంగా రైతులను ఆదుకోవాలని తెలంగాణ ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట జోన్ పామాయిల్ గ్రోయర్స్ సొసైటీ అద్యక్షకార్యదర్శులు తుంబూరు మహేశ్వర రెడ్డి,కొక్కెరపాటి పుల్లయ్య లు గురువారం తెలంగాణ వ్యవసాయ, చేనేత – జౌళి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వరరావు కు వినతి పత్రం అందించారు. దానిలోని సారాంశం యధాతధంగా. రైతుకు స్థిరమైన ఆదాయం ఇవ్వగలిగి,విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తూ చీడపీడలు,ప్రకృతి విపత్తులను కొంతవరకు తట్టుకునే ఆయిల్ పామ్ సాగు తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతూ వస్తున్నది.ఇదే క్రమంలో రైతులకు సమస్యలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున తీసుకొనవలసిన, రైతులు కోరుతున్న కొన్ని అంశాలు తమ దృష్టికి తీసుకువస్తున్నాము. 1) కేంద్ర ప్రభుత్వం క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతులపై దిగుమతి పన్ను పూర్తిగా తొలగించడం వల్ల మన దేశంలో పండిస్తున్న పంటకు 50% పైగా ధర తగ్గి, రూ.13,000 లు కు పడిపోయింది.భారత దేశంలో పామ్ ఆయిల్ సాగు చేసి ఎంతో విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేస్తూ దేశీయంగా వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధికి దోహదపడుతున్న అయిల్పామ్ రైతులను ఆదుకోవాలని కనీసం ఒక టన్ను ఆయిల్ ఫాం గెలలకు రూ.25,000 లు మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. 2) దేశంతో పాటు మన రాష్ట్రంలో కూడా విస్తరిస్తున్న ఈ పంట సాగు, పరిశ్రమల బహుళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆయిల్ పామ్ బోర్డు ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతున్నాము.
3) గత ప్రభుత్వ హయాములో ఆయిల్ఫైడ్ లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించి,అక్రమాలకు పాల్పడిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని,వారి నిర్వాకం వల్ల నకిలీ (హాఫ్ టైప్) కాపు రాని మొక్కలు సరఫరా చేయడం వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నాము. 4)తెలంగాణ లో వేగంగా విస్తరిస్తున్న ఆయిల్ పామ్ సాగుకు, పరిశ్రమకు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ళు,తెగుళ్ళు,పురుగులు, ఈ సాగులో ప్రధాన అంశం అయిన మొక్కల నాణ్యత,గెలలు కోతకు నైపుణ్యం కలిగిన కూలీల కొరత రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పరిశోధన,బోధన,రైతులకు శిక్షణా కేంద్రాన్ని అన్ని వసతులు గల అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో అనుబంధంగా ఏర్పాటు చేయగలరని కోరుతున్నాము. ఇక్కడ ఈ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు ఈ కళాశాల ఆధీనంలోని 400 ఎకరాల భూమి,ఆయిల్పామ్ సాగుకు అనువైన నేల, పుష్కలంగా నీటి లభ్యత,ఆయిల్ పామ్ నర్సరీలు, పరిశ్రమలు ఉన్నాయి. 5) ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 1.3 లక్షల ఎకరాల సాగులో వుండి,ఈ జిల్లాలో ఇప్పటికే ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ఉన్న రెండు ఫ్యాక్టరీల లో సుమారుగా ఒక ఏడాదికి 3 లక్షల టన్నుల గెలలు క్రషింగ్ ద్వారా వేల టన్నుల క్రూడ్ పామ్ ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నారు.ఇది వచ్చే రెండు సంవత్సరాలలో రెట్టింపు అయ్యే అవకాశం వుంది.ఈ ముడి పామ్ ఆయిల్ ను ప్రైవేట్ రిఫైనరీ లకు విక్రయించి, తిరిగి వారి నుండి శుద్ధి చేసిన పామ్ ఆయిల్ ను ఆయిల్ ఫెడ్ కొనుగోలు చేస్తున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయిల్ఫైడ్ ఆధ్వర్యంలో రిఫైనరీ నిర్మించి,తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ముడి పామ్ ఆయిల్ ను శుధ్ధి చేసి విక్రయించ గలిగితే రైతుకు అదనపు ఆదాయం,రాష్ట్రానికి కొంత ఆర్ధిక లాభం చేకూరుతుంది.కావున సాధ్యమైనంత త్వరగా రిఫైనరీ నిర్మించి,ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసుల కల నెరవేర్చాలని కోరుతున్నాము. 6) గత ప్రభుత్వ హయాములో ఆయిల్ఫైడ్ అశ్వారావుపేట, అప్పారావు పేట ఫ్యాక్టరీల లో ఉత్పత్తి అయ్యే ముడి పామ్ ఆయిల్ విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయం నుండి సి.యస్.ఆర్. ఫండ్స్ ను ఈ ప్రాంతాలలో కాకుండా ఇతర ప్రాంతాలలో ఖర్చు చేశారు.ఇక మీదట ఈ సి.యస్. ఆర్. ఫండ్స్ ను ఈ ప్రాంత అభివృద్ధికి మాత్రమే కేటాయించేలా చర్యలు తీసుకోవాలని మనవి చేసుకుంటున్నాము.

Spread the love