ఆయిల్ ఫాం గెలలుకు మద్దతు ధర నిర్ణయించాలి..

– సకాలంలో సాగు దారులకు రాయితీలు చెల్లించాలి..
– ఆయిల్ ఫాం పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయండి..
– ఆయిల్ ఫెడ్ ఎం.డి యాస్మిన్ బాషా కు వినతి పత్రం అందించిన గ్రోయర్స్ సొసైటీ అద్యక్షకార్యదర్శులు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఉద్యాన శాఖ ప్రధాన కార్యదర్శి,ఆయిల్ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.యాస్మిన్ బాషా కు తెలంగాణ ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్ పామ్ గ్రోయర్స్ సొసైటీ రైతులు తరుపున అద్యక్షకార్యదర్శులు తుంబూరు మహేశ్వర రెడ్డి,కొక్కెరపాటి పుల్లయ్య లు శనివారం హైద్రాబాద్ లో ఆయిల్ ఫెడ్ రాష్ట్ర కార్యాలయంలోని వారి ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా రైతులు ఎదుర్కుంటున్న సమస్యలు పై వినతి పత్రం అందించారు. ఆ వినతి పత్రం లోని అంశాలు యథాతథం. రైతుకు స్ధిరమైన ఆదాయం ఇవ్వగలిగి,విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తూ చీడపీడలు,ప్రకృతి విపత్తులను కొంతవరకు తట్టుకునే ఆయిల్ పామ్ సాగు తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతూ వస్తున్నది.ఇదే క్రమంలో రైతుల సమస్యలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున తీసుకొనవలసిన,రైతులు కోరుతున్న కొన్ని అంశాలు తమ దృష్టికి తీసుకువస్తున్నాము.
1) కేంద్ర ప్రభుత్వం క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతులపై దిగుమతి పన్ను పూర్తిగా తొలగించడం వల్ల భారత దేశంలో పండిస్తున్న పంటకు 50% పైగా ధర తగ్గి, రూ.13,000 లు పడిపోయింది. దేశంలో పామ్ ఆయిల్ సాగు చేసి ఎంతో విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేస్తూ దేశీయంగా వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధికి దోహదపడుతున్న ఆయిల్ పామ్ రైతులను ఆదుకోవాలని కనీసం ఒక టన్ను ఆయిల్పామ్ గెలలకు రూ.25,000 లు మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
2) దేశంతో పాటు మన రాష్ట్రంలో కూడా విస్తరిస్తున్న ఈ పంట సాగు రైతుల,పరిశ్రమల బహుళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆయిల్ పామ్ బోర్డు ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతున్నాము.
3) గత ప్రభుత్వ హయాములో ఆయిల్ఫెడ్ లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించి, అక్రమాలకు పాల్పడిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని మరియు వారి నిర్వాకం వల్ల నకిలీ (హాఫ్ టైప్) కాపుకురాని మొక్కలు సరఫరా చేయడం వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నాము.
4) మన రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న ఆయిల్ పామ్ సాగుకు,పరిశ్రమకు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లు తెగుళ్ళు, పురుగులు,ఈ సాగులో ప్రధాన అంశం అయిన మొక్కల నాణ్యత, గెలల కోతకు నైపుణ్యం కలిగిన కూలీల కొరత, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పరిశోధన,బోధన, రైతులకు శిక్షణా కేంద్రాన్ని అన్ని వసతులు గల అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజీకి అనుబంధంగా ఏర్పాటు చేయగలరని కోరుతున్నాము. ఇక్కడ ఈ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు ఈ కాలేజి అధీనం లోని 400 ఎకరాల భూమి, అయిల్పామ్ సాగుకు అనువైన నేల, పుష్కలంగా నీటి లభ్యత, ఆయిల్ పామ్ నర్సరీలు, పరిశ్రమలు ఉన్నాయి.
5) ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 1.3 లక్షల ఎకరాల సాగులో వుండి, ఈ జిల్లాలో ఇప్పటికే ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ఉన్న రెండు ఫ్యాక్టరీలలో సుమారుగా ఒక ఏడాదికి 3 లక్షల టన్నుల గెలలు క్రషింగ్ ద్వారా వేల టన్నుల క్రూడ్ పామ్ ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నారు- ఇది వచ్చే రెండు సంవత్సరాలలో రెట్టింపు అయ్యే అవకాశం వుంది.ఈ ముడి పామ్ ఆయిల్ ను ప్రైవేట్ రిఫైనరీలకు విక్రయించి, తిరిగి వారి నుండి శుద్ది చేసిన పామ్ ఆయిల్ ను మన ఆయిల్ ఫెడ్ కొనుగోలు చేస్తున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో రిఫైనరీ నిర్మించి, మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ముడి పామ్ ఆయిల్ ను శుధ్ధి చేసి విక్రయించగలిగితే రైతుకు అదనపు ఆదాయం, రాష్ట్రానికి కొంత ఆర్ధిక లాభం చేకూరుతుంది. కావున సాధ్యమైనంత త్వరగా రిఫైనరీ నిర్మించి, ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసుల కల నెరవేర్చగలరని కోరుతున్నాము.
6)గత ప్రభుత్వ హయాములో ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట, అప్పారావుపేట ఫ్యాక్టరీలలో ఉత్పత్తి అయ్యే ముడి పామ్ ఆయిల్ విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయం నుండి సి.యస్.ఆర్. ఫండ్స్ ను ఈ ప్రాంతాలలో కాకుండా ఇతర ప్రాంతాలలో ఖర్చు చేశారు. ఇక మీదట ఈ సి. యస్. ఆర్. ఫండ్స్ ఈ ప్రాంత అభివృద్ధికి మాత్రమే కేటాయించేలా చర్యలు తీసుకోవాలని మనవి చేసుకుంటున్నాము.
7) గత దశాబ్ద కాలంగా హార్టికల్చర్ శాఖలో 901 ఉద్యోగుల ఖాళీలు ఉన్నాయి. వీటిని భర్తీ చేసి రైతులకు సాగులో సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
8) అప్పారావుపేట ఫ్యాక్టరీ నందు 60 ఎంటి నుండి 90 ఎంటి లకు చేపట్టిన విస్తరణలో వర్టికల్ స్టెరిలైజేషన్ విధానంలో లోపాల వల్ల ఆయిల్ రికవరీ తగ్గుతోందని మరియు ఆయిల్ లో ఎఫ్ఎస్ఏ శాతం అధికంగా ఉంటోందని తెలియవస్తోంది. ఇది నిజమయితే రైతులకు తీరని నష్టం జరిగే అవకాశం ఉంది. దీనిపై సత్వర విచారణ చేపట్టి నిజానిజాలను వెలికి తీయవలసిందిగా కోరుతున్నాము.
9) ఎంఈఈ ప్లాంట్ నుండి ఉత్పత్తి అవుతున్న డ్రై పౌడర్ సుమారుగా 250 టన్నులు ఫ్యాక్టరీ నందు నిల్వ ఉంది. దీనిని 1 కె.జీ రూ.3 ల చొప్పున రైతులకు విక్రయించాలని కోరుతున్నాము.
10) అశ్వారావుపేట, అప్పారావుపేట ఫ్యాక్టరీలలో ఉత్పత్తి అయిన సీపీఓ ను 80 శాతానికి పైగా ఆంధ్రప్రదేశ్లోని నవభారత్ వారికే విక్రయిస్తున్నారు. దీనిలో అనేక అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. దీని నివారణ కోసం సీపీఓ అమ్మకాలకు ఈ ప్రొక్యూర్మెంట్ విధానాన్ని అవలంభించవలసిందిగా అమ్మకాలకు సంబంధించిన అన్ని విషయాలను రైతులకు అందుబాటులో ఉంచాలని కోరుతున్నాము.
Spread the love