నవతెలంగాణ – తిరుపతి: ప్రముఖ నటుడు, విద్యావేత్త, శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఎం. మోహన్ బాబు స్థాపించిన తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ (ఎస్వీఐఎస్).. సీబీఎస్ఈ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్కు తమ పాఠశాలకు చెందిన మూడు జట్లను అర్హత సాధించేలా చేసి అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ జోన్ (సీబీఎస్ఈ క్లస్టర్ VII) లో ఛాంపియన్గా నిలిచిన అండర్-17 బాలుర జట్టు, అండర్-19 బాలుర జట్టు మరియు అండర్-19 బాలికల జట్లు ఇప్పుడు జాతీయ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్-తెలంగాణ క్లస్టర్కు ప్రాతినిధ్యం వహించనున్నాయి.
ఈ సీబీఎస్ఈ క్లస్టర్ VII వాలీబాల్ ఛాంపియన్షిప్ రెండు వేదికల్లో జరిగింది. అండర్-17 మరియు అండర్-19 బాలుర పోటీలకు గద్వాల్ ఆతిథ్యం ఇవ్వగా, అండర్-19 బాలికల పోటీలు అనంతపురంలో జరిగాయి. ఈ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ సీబీఎస్ఈ పాఠశాలలు పాల్గొన్నాయి. జాతీయ ఛాంపియన్షిప్లో స్థానం దక్కించుకోవడం కోసం జట్లన్నీ హోరాహోరీగా తలపడ్డాయి.
ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ సుమన్ మరియు ప్రధాన కోచ్ శ్రీ అజిత్ మార్గదర్శకత్వంలో ఎస్వీఐఎస్కు చెందిన మూడు వాలీబాల్ జట్లు టోర్నమెంట్ ఆసాంతం అసాధారణమైన నైపుణ్యాన్ని, జట్టు స్ఫూర్తిని, పట్టుదలను ప్రదర్శించి ప్రతిష్టాత్మక సీబీఎస్ఈ జాతీయ ఛాంపియన్షిప్కు అర్హత సాధించాయి.
హిమాచల్ ప్రదేశ్లోని కసౌలీలో అక్టోబర్లో జరగనున్న సీబీఎస్ఈ జాతీయ బాలుర వాలీబాల్ ఛాంపియన్షిప్లో ఎస్వీఐఎస్ బాలుర వాలీబాల్ జట్లు పోటీపడనున్నాయి. అదే విధంగా పంజాబ్లోని లూథియానాలో అక్టోబర్లో జరగనున్న సీబీఎస్ఈ జాతీయ బాలికల వాలీబాల్ ఛాంపియన్షిప్కు ఎస్వీఐఎస్ బాలికల జట్టు ఎంపికైంది.
ఈ ఘనతపై ఎస్వీఐఎస్ ఈడీ మరియు ట్రస్టీ వినయ్ మహేశ్వరి మాట్లాడుతూ, “సీబీఎస్ఈ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్కు మా మూడు జట్లు ఎంపిక కావడం శ్రీ విద్యానికేతన్ కుటుంబం మొత్తానికీ ఎంతో గర్వకారణం. ఈ విజయం మా విద్యార్థుల అంకితభావం మరియు క్రమశిక్షణను, మా కోచ్ల నిరంతర కృషితో పాటు తల్లిదండ్రులు, అధ్యాపకుల అచంచలమైన మద్దతును ప్రతిబింబిస్తోంది. నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తి మరియు స్థైర్యాన్ని పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని ఎస్వీఐఎస్లో మేము బలంగా విశ్వసిస్తాము. ఇంతటి ప్రతిష్టాత్మక వేదికపై మా విద్యార్థులు రాణించడం మాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. జాతీయ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్-తెలంగాణ క్లస్టర్కు ప్రాతినిధ్యం వహిస్తున్న మా జట్లు ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాము” అని పేర్కొన్నారు.
ఆధునిక తరగతి గదులు, అధునాతన ప్రయోగశాలలు, ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలు మరియు అనుభవపూర్వక అభ్యసన సౌకర్యాలతో కూడిన ఎస్వీఐఎస్.. విద్యా నైపుణ్యాన్ని మరియు విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని పెంపొందించే వాతావరణాన్ని అందిస్తుంది. చదువు, క్రీడలతో పాటు ఇతర రంగాల్లోనూ విద్యార్థులు రాణించేలా వారిని సన్నద్ధం చేయడానికి పాఠశాల ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది.


