నవతెలంగాణ – హైదరాబాద్: 2008 ముంబై ఉగ్రవాద దాడి కేసులో ప్రధాన నిందితుడైన తహవ్వుర్ హస్సేన్ రాణా భారత్కు చేరుకున్నాడు. అతడిని అమెరికా నుండి తీసుకువచ్చిన ప్రత్యేక విమానం గురువారం మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అక్కడి నుండి అతడిని అధికారులు ప్రత్యేక భద్రత నడుమ తీహార్ జైలుకు తరలించనున్నారు. రాణాను తరలించేందుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సిద్ధం చేశారు. తహవ్వుర్ రాణా రాక నేపథ్యంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పాకిస్థాన్లో జన్మించిన తహవ్వుర్ హుస్సేన్ రాణా కెనడా పౌరసత్వం కలిగి ఉన్నాడు. తనను భారత్కు అప్పగించవద్దంటూ అతను పలుమార్లు అమెరికా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ నిరాశే ఎదురైంది. రాణా పిటిషన్ను కోర్టు కొట్టివేయడంతో, అతడిని తీసుకు వచ్చేందుకు భారత్ నుండి ప్రత్యేక బృందం అమెరికాకు వెళ్లింది. భారత బృందానికి రాణాను అప్పగించిన అనంతరం, అతను తమ కస్టడీలో లేడని అమెరికా ఫెడరల్ ప్రిజన్స్ బ్యూరో స్పష్టం చేసింది.