– బీఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్య నాయకుల కొనుగోలు ముదురుతున్న వివాదాలు.
– ఎంపీపీని అడ్డుకున్న ఎంపీటీసీలు సర్పంచులు.
– కొనుగోలు కోసం ఐదు లక్షలు ఇచ్చిందంటూ మాజీ కౌన్సిలర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.
– కొనుగోలు కోసం ఐదు లక్షలు ఇచ్చిందంటూ మాజీ కౌన్సిలర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.
నవతెలంగాణ – భువనగిరి: భువనగిరి నియోజకవర్గంలో ఎన్నడూ లేనంతగా రాజకీయ వివాదాలకు చేరికలకు రాజకీయ చదరంగం గా మారి క్లైమాక్స్ కు చేరుకుంటున్నాయి. రెండు పార్టీలు నువ్వా నేనా అన్న చందంగా మారాయి. బెంగళూరు బ్రదర్స్ గా పిలవబడుతున్న పైళ్ల శేఖర్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున కుంభం అనిల్ కుమార్ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. రాష్ట్రంలోనే అత్యధిక డబ్బులు ఖర్చు చేస్తున్న నియోజకవర్గంగా భువనగిరి అంటూ ఆరోపణలు అనేక ఉన్నాయి. రాత్రికి రాత్రే ద్వితీయ శ్రేణి నాయకులు ముల్లె మూటతో కండువలు వేసుకుంటూ ప్రత్యర్థి శిబిరంలో తేలుతున్నారు. ఇప్పటివరకు ఒక పార్టీ తరఫున ప్రచారం చేసి అరగంటలోనే ఇంకో శిబిరంలో తేలుతున్నారు. మేము అభివృద్ధి కోసమే పోతున్నామని ఇరువర్గాల్లో చేరుతున్న నాయకులు చెప్తున్నారు. భువనగిరి ఎంపీపీ నిర్మల సోమవారం అకస్మాత్తుగా కుంభం అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీపీని అడ్డుకుంటూ మండల ఆఫీస్ కార్యాలయం ముందు ఎంపీటీసీలు సర్పంచులు పెద్ద ఎత్తున నిరసన చేశారు. వాగ్వివాదంతో పాటు ఒకరినొకరు మహిళలు చేతులు పట్టుకుంటూ తోసుకొనే కాడికి వచ్చింది. పోలీసులు బిత్తర పోయి చూస్తున్నారు. కాంగ్రెస్ కి ఎంపీపీ అమ్ముడుపోయిందన్నారు. ఎంపీపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు ఆరోపణలు చేశారు. ఎంపీటీసీలు సర్పంచులు అదే సమయంలో మంగళవారం భువనగిరి పట్టణం ఒకటో వార్డు మాజీ కౌన్సిలర్ పోలిశెట్టి అనిల్ కుమార్ పైల శేఖర్ రెడ్డి తనకు ఐదు లక్షల రూపాయలు ఆఫర్ ఇచ్చాడని పేర్కొంటూ డబ్బులను పోలీసులకు అందజేసి ఫిర్యాదు చేశారు. తాము పంపియలేదని రాజకీయంగా ఎదుర్కోలేక ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు.
సమస్యాత్మకంగా భువనగిరి నియోజకవర్గం.
భువనగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మద్య హోరా హోరీగా కొనుగోలు అమ్మకాలు జరుగుతున్న ఆరోపణలు దృష్ట్యా నియోజకవర్గం సమస్యాత్మకంగా మారే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తన స్థానాన్ని హ్యాట్రిక్ ద్వారా గెలుచుకోవాలని బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి భావిస్తున్నారు సుమారు 45 ఏళ్లుగా ఓడిపోతున్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న ఊపుతో గెలవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు పార్టీల వారు అంగాబల, అర్ధబలం ప్రదర్శిస్తూ రాజకీయ చదరంగంలో పావులు కదుపుతున్నారు. భువనగిరి పట్టణం హనుమాన్ వాడలో తుమ్మల వినోద్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరారు. తర్వాత తిరిగి బీఆర్ఎస్ లో చేరారు దీంతో వివాదం జరిగి ఒకరిపై ఒక పార్టీ వాళ్లు దాడి చేసుకొని పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. భువనగిరి నియోజకవర్గంలోని సమస్యాత్మకమైన గ్రామాలతో పాటు ప్రశాంతంగా ఉండే గ్రామాలలో వార్డులలో కొట్లాటలు జరగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు ప్రత్యేక టీమ్లతో పర్యవేక్షణ చేస్తున్నారు.