
నవతెలంగాణ – దామరచర్ల
నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఉన్న చెరువులను కుంటలను నింపి తాగునీరు ఎద్దడిని నివారించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. దామరచర్ల లోని పలు చెరువులను ఆదివారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ఎడమకాల పరిధిలో మంచినీటి ఎద్దడి ప్రారంభమైందని చెప్పారు. చెరువులు పూర్తిగా ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటడం తో మంచినీటి బోర్లు ఎండిపోయి త్రాగడానికి నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఎంతో మంది దూర ప్రాంతాల నుండి ట్యాంకర్ల ద్వారా తెచ్చుకుంటు నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మిషన్ భగీరథ నీరు కూడా అన్ని గ్రామాలలో పూర్తిస్థాయిలో రావడం లేదని అన్నారు. ఇటీవల సాగర్ నుండి ఖమ్మం జిల్లా పాలేరు ప్రాజెక్టుకు ముందు జాగ్రత్తగా నీటి విడుదల చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో గ్రామాలలో చెరువులకు కూడా ఈ విధంగా మీరు నీరు విడుదల చేసి నింపినట్లైతే భూగర్భ జలాల లభ్యత పెరిగి తిరిగి చేతిపంపు బోర్లు ద్వారా త్రాగునీటి సౌకర్యం ఏర్పడే అవకాశం ఉందన్నారు. వేసవి ప్రారంభంలోనే ఇంత నీటి కొరత ఉంటే నిండు వేసవిలో పరిస్థితి మరింత తీవ్రత ఏర్పడే అవకాశం ఉంది అన్నారు. అదేవిధంగా కొంతమంది రైతులు బోర్లపై ఆధారపడి వేసుకున్న పంట పూర్తిగా ఎండిపోవడం జరిగిందన్నారు. అట్టి పంటను గొర్లు పశువులు మేపడం జరుగుతుందన్నారు. రెవిన్యూ , వ్యవసాయ అధికారులు పరిశీలించి పంట నష్టాన్ని గుర్తించి వారికి నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుండి పరిహక ప్రాంతాలలో చెరువులను నింపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు ,పార్టీ మండల కార్యదర్శి వినోద్ నాయక్, సీనియర్ నాయకులు పాపా నాయక్, దయానంద్, ఎర్రనాయక్ ,కోటిరెడ్డి, సుభాని, గోపి వెంకట్ రెడ్డి విజయ్ రవి బాలు పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.