షాకింగ్ ఘటన..ఆహారం కోసం భవనంపై నుంచి దూకిన బాలిక

నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలోని వెస్ట్‌ వర్జీనియాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆహారం కోసం ఓ ఎనిమిదేళ్ల బాలిక మొదటి అంతస్తు నుంచి దూకింది. తల్లిదండ్రులు ఆమెకు కొన్ని రోజులుగా ఆహారం ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. ర్యాన్‌ కీత్‌ హర్డ్‌మన్‌, ఎలియో ఎమ్‌ దంపతులు ఆర్నాల్డ్స్‌బర్గ్లో నివాసముంటున్నారు. వీరికి నలుగురు పిల్లలు. తమ ఎనిమిదేళ్ల కుమార్తెకు చాలా రోజులుగా ఆహారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించారు. బాలికను బయటకు రాకుండా ఇంట్లోనే నిర్బంధించారు. ఆకలికి తట్టుకోలేని చిన్నారి టెడ్డీబేర్‌ సాయంతో మొదటి అంతస్తు నుంచి కిందకు దూకింది. దగ్గర్లో ఉన్న దుకాణాల వద్దకు వెళ్లి ఆహారాన్ని అడిగింది. అందులో ఉన్న ఒక ఉద్యోగి పాప పరిస్థితిని గమనించి ఆహార పదార్థాలు అందించాడు. అనుమానంతో ఆమెను ప్రశ్నించగా.. ఆమె తన తల్లిదండ్రుల గురించి వివరించింది. విషయం తెలుసుకున్న ఉద్యోగి అధికారులకు సమాచారం అందించాడు. ‘‘నేను చాలా రోజులుగా ఆకలితో ఉన్నాను. అమ్మ, నాన్న నన్ను సరిగా చూసుకోవడం లేదు. ఇంట్లో నుంచి బయటకు రానివ్వడం లేదు. నన్ను శిక్షించేవారు. అందుకే పై నుంచి దూకాను. మూడు రోజుల క్రితం ఒక బర్గర్‌ మాత్రమే తిన్నాను’’అని బాలిక తెలిపింది. వారి ఇంటిని అధికారులు సోదా చేశారు. ఇంట్లో ఆహారం ఉన్నా పెట్టడం లేదని తేలింది. వారి నుంచి మాదక ద్రవ్యాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో బాలిక తల్లిదండ్రులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

Spread the love