– ప్రాణానికి ఖరీదు లక్ష ముప్పై వేలు
– శ్రీ అక్షర ఆసుపత్రి నిర్వాకం
– సర్జరీ ఫెయిల్..! ప్రాణం పోయింది..!!
నవతెలంగాణ – నల్లగొండ టౌన్
నల్లగొండ కార్పొరేట్ హాస్పిటల్ నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారు. పేషెంట్ కు షుగర్ ఉన్న సంగతి మరిచి ఆపరేషన్ చేస్తున్నారు. ప్రాణానికి వెలగట్టి డాక్టర్లు చేతులు దులుపుకుంటున్నారు. ఈ ఘటన శుక్రవారం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. నార్కెట్పల్లి మండలం ఎడవెల్లి గ్రామానికి చెందిన ఏమి రెడ్డి శంకర్ రెడ్డి కు గాల్బ్లాడర్ సమస్యతో జిల్లా కేంద్రంలోని అక్షర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో పది రోజుల క్రితం చేరినట్టు సమాచారం. పేషెంట్ కు షుగర్ ఉన్న సంగతి మరిచి డాక్టర్లు ఆపరేషన్ చేశారు. ఆ పేషెంట్ తిరిగి రెండు రోజుల తర్వాత కడుపు నొప్పితో హాస్పిటల్ కు వచ్చాడు.
ఆస్పత్రి సిబ్బంది పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. మా ఆస్పత్రిలో ఫెసిలిటీ లేదని వేరే హాస్పిటల్ కి ప్రముఖ డాక్టర్ రిఫర్ చేశారు. ఆపరేషన్ సక్సెస్ కానీ షుగర్ వ్యాధి కంట్రోల్ కాకపోవటంతో వేరే హాస్పిటల్ సిబ్బంది కూడా చేతులెత్తేశారు. రోగి సభ్యులు చేసేదేమీ లేక కామినేని హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే ఆ రోగి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. బాధిత కుటుంబ సభ్యులు మృతదేహంతో వెంటనే అక్షర హాస్పిటల్ కు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అక్షర హాస్పిటల్ యాజమాన్యం ప్రాణం ఖరీదు లక్ష 30 వేల రూపాయలను ముఖాన కొట్టి కూల్ చేసుకున్నాడు.



