నవతెలంగాణ -మార్కాపురం: పాఠాలు చెప్పి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు పర్చాల్సిన ఓ ప్రయివేట్ అధ్యాపకుడు దారి తప్పాడు. ఈ ఘటన మంగళవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మార్కాపురం పట్టణానికి చెందిన ఓ విద్యార్థిని 2022లో ఓ ప్రయివేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ అభ్యసించేందుకు చేరింది. అక్కడ యర్రగొండపాలెం మండలం పాలుట్ల గ్రామానికి చెందిన గోవింద్ నాయక్ అనే వ్యక్తి అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అప్పటికే అతనికి వివాహమై ఓ కుమారుడు ఉన్నారు. ఇంటి వద్ద దించే నెపంతో విద్యార్థినిని ఓ రోజు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. పట్టణ శివారులోకి తీసుకెళ్లి అక్కడ ఆమె అసభ్యకర చిత్రాలను చరవాణిలో బంధించాడు. అనంతరం వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో సదరు విద్యార్థిని ఇంటర్ రెండో ఏడాది ఆ కళాశాలలో కాకుండా మరో చోట చదివేందుకు వెళ్లిపోయింది. అయినప్పటికీ గోవింద్ నాయక్ తన వికృత చేష్టలు మానలేదు. ఆమె అసభ్య చిత్రాలు తన వద్ద ఉన్నాయని.. ఇతరులకు చూపుతానని బెదిరింపులకు గురిచేస్తూ పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆ విద్యార్థిని గర్భం దాల్చింది. విషయం తెలిసిన నిందితుడు గర్భ విచ్ఛిత్తి చేసుకోవాలని డిమాండ్ చేశాడు. ఆమె అంగీకరించక పోవడంతో దాడికి పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరిన ఆమెను వైద్యులు పరీక్షించారు. కడుపుపై దెబ్బలు తగలడంతో విద్యార్థిని ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి తలెత్తిందని.. గర్భ విచ్ఛిత్తి చేయాలని సూచించారు. చివరికి బాధితురాలు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రయివేట్ అధ్యాపకుడిపై లైంగికదాడి, పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.