ప్రజాయుద్ధనౌక గద్దర్ కన్నుమూత

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రజాయుద్ధనౌక గద్దర్(74) ఇకలేరు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇటీవల గుండెపోటు రావడంతో ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. చివరికి ఆరోగ్యం విషమించి ఈరోజు తుదిశ్వాస విడిచారు. 1949లో తూప్రాన్‌లో జన్మించిన గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఎన్నో పాటలతో ఉద్యమానికి ఊపిరి పోశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. 1975లో కెనరా బ్యాంకులో క్లర్క్‌గా గద్దర్ చేరారు. తర్వాత వివాహం చేసుకున్నారు. ఆయన భార్య పేరు విమల. ఆయనకు ముగ్గురు పిల్లలు– సూర్యుడు, చంద్రుడు (2003లో అనారోగ్యంతో చనిపోయారు), వెన్నెల ఉన్నారు. మాభూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించారు. యాదగిరి పాడిన ‘బండెనక బండి కట్టి’ అనే పాటను ఆయనే పాడి, ఆడారు. 1984లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1985లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసి ఆలపించిన అమ్మా తెలంగాణమా, పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.  1997 ఏప్రిల్‌ 6న నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో గద్దర్‌పై కాల్పులు జరిగాయి. ఆయన రాసిన నీ పాదం మీద పుట్టుమచ్చనై అనే సినిమా పాటకు నంది అవార్డు వచ్చింది. అయితే అవార్డును ఆయన తిరస్కరించారు. అయినప్పటికి ప్రజా సమస్యలపై చివరి వరకు పోరాడారు.
కాగా, గద్దర్‌ నిజామాబాదు జిల్లా మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌లో విద్యభ్యాసం పూర్తి చేశారు. కుటుంబ నియంత్రణ, పారిశుధ్యం వంటి అనేక సామాజిక విషయాల గురించి ఆయన బుర్రకతలను తయారు చేసుకొని ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించేవారు.  ఆయన పాడే పాటలకు ప్రజల్లో ఎంతో చైతన్యం కలిగించేవి. దళిత పేదలు అనుభవిస్తున్న కష్ట, నష్టాలను ఆయన, ఆయన బృందం కళ్లకు కట్టినట్టుగా పాటలు, నాటకాల రూపంలో తెలియ జెప్పేవారు.

Spread the love