నవతెలంగాణ – హైదరాబాద్ : భారత దేశవాళీ క్రికెట్లో ఒక చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. కేవలం 15 ఏండ్ల వయసున్న యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ, దులీప్ ట్రోఫీ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్లో ఈస్ట్ జోన్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బెంగళూరు వేదికగా సెంట్రల్ జోన్తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్లో రెగ్యులర్ కెప్టెన్ ఇషాన్ కిషన్ గాయపడటంతో, వైస్ కెప్టెన్గా ఉన్న వైభవ్ ఈ అనూహ్య బాధ్యతలను స్వీకరించాడు.
మ్యాచ్లో సెంట్రల్ జోన్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. వికెట్ కీపింగ్ చేస్తున్న ఇషాన్ కిషన్ కుడి చేతి మణికట్టుకు బంతి బలంగా తాకింది. మైదానంలోనే ఫిజియోలు ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ, నొప్పి తీవ్రంగా ఉండటంతో అతను మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అనంతరం అతని చేతికి పెద్ద కట్టుతో డగౌట్లో కనిపించాడు. దీంతో ఇషాన్ స్థానంలో కుమార్ కుశాగ్ర వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టగా, కెప్టెన్సీ పగ్గాలు వైభవ్ సూర్యవంశీ చేతికి వచ్చాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇంత చిన్న వయసులో ఒక సీనియర్ జట్టుకు నాయకత్వం వహించడం ఒక అరుదైన రికార్డుగా నిలిచింది.


