నవతెలంగాణ – హైదరాబాద్ : టాలీవుడ్లో ఎంతో ఆసక్తి రేపుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రానికి ఈరోజు అధికారికంగా అంకురార్పణ జరిగింది. విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్ రామ్ తొలిసారి కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా పూజా కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాత అల్లు అరవింద్ వంటి సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు.
ఈ సినిమాలో కథానాయికల వివరాలను కూడా చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. వెంకీ సరసన జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేశ్ నటిస్తుండగా, కల్యాణ్ రామ్ సరసన టాలెంటెడ్ బ్యూటీ కృతి శెట్టి నటించనుంది. దగ్గుబాటి, నందమూరి హీరోల కలయికలో వస్తున్న ఈ ప్రాజెక్ట్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్ర నిర్మాణంలో సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంస్థలు భాగస్వామ్యం వహిస్తున్నాయి. జాతీయ అవార్డు విజేత జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.



