రాజ్ఘాట్ వద్ద కేజ్రీవాల్, ఆప్ నేతల ప్రతిజ్ఞ
ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ప్రజల ముందుకు
మరో సత్యాగ్రహం తప్పదు
మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఆప్ అధినేత
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మంగళవారం రాజ్ఘాట్ను సందర్శించారు. మహాత్మా గాంధీ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ మాజీ సీఎం అతిశీ మర్లెనా, ఆప్ ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మహాత్ముడి అడుగుజాడల్లో నడుస్తూ అవినీతిపై పోరాటం కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
న్యాయవ్యవస్థపై గౌరవం
ఈ సందర్భంగా కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. న్యాయ పోరాటం కొనసాగిస్తామని అన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ మద్యం స్కాం కేసు కోర్టుకు సంబంధించిన విషయమని, తాము న్యాయ వ్యవస్థను, కోర్టులను పూర్తిస్థాయిలో గౌరవిస్తామని స్పష్టం చేశారు. తమపై వచ్చిన ఆరోపణలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వివరించారు. ఈ కేసులో న్యాయవ్యవస్థ తమను నిర్దోషులుగా గుర్తించిందని, అందుకే బెయిల్ మంజూరు చేసిందని కేజ్రీవాల్ గుర్తు చేశారు. తమ నిజాయితీకి ఇదే నిదర్శనమని అన్నారు. ప్రస్తుతం తలెత్తిన కొన్ని అసాధారణ పరిస్థితుల కారణంగా తాను సత్యాగ్రహం చేయాల్సి వస్తోందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజల ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. మరో సత్యగ్రహం తప్పదని మోడీ ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ హెచ్చరించారు.



